
- పీసీసీ నిరసన ర్యాలీలో నేతల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నీట్ రద్దు చేసి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని మండిపడ్డారు. నీట్ లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు కొనసాగింది.
నీట్ రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... నీట్ రద్దు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారని చెప్పారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...
ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని, అందులో నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తా అని అన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ... ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగినందున, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పాలన పేపర్ లీకుల సర్కార్ గా మారిందని విమర్శించారు. నిరసన ర్యాలీలో ఎంపీ మల్లు రవి, నేతలు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
బషీర్ బాగ్, వెలుగు: నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. బర్కత్ పురా చౌరస్తా నుంచి కిషన్ రెడ్డి ఇంటికి ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను , బర్కత్ పురా చమాన్ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దేశ యువతను మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మోత రోహిత్ మండిపడ్డారు. కాగా, శనివారం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు.