నేపాల్ పార్లమెంట్ రద్దుకు ఆ దేశ ప్రధాని కేపీ ఓలి సిఫారసు చేశారు. ప్రస్తుత ప్రధాని ఓలికి మరియు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్
ప్రచండకు మధ్య అధికారం కోసం చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఓలికి వ్యతిరేకంగా నేపాల్ కేబినేట్లోని కొంతమంది
మంత్రులతో మాజీ ప్రధాని ఓ వర్గాన్ని తయారుచేశారు. వీరితో కలిసి ఓలిని ప్రచండ ఇబ్బందులకు గురిచేసేవాడు. వాటన్నింటిని భరించిన ఓలి..
ఆదివారం అత్యవసర కేబినేట్ మీటింగ్ ఏర్పాటుచేసి.. పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి.. రద్దు తీర్మానాన్ని
రాష్ట్రపతి బిడియా దేవి భండారికి సిఫారసు చేసినట్లు అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సిపి) సీనియర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు తెలిపారు.
నేపాల్ పార్లమెంట్ 2017లో ఏర్పడింది. ఈ పార్లమెంట్లో 275 మంది సభ్యులున్నారు. కేబినేట్ నిర్ణయంతో ప్రధాని ఓలి.. రాష్ట్రపతి భవన్కు
చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్ రద్దు గురించి తెలియజేస్తారు.
రెండు గ్రూపుల మధ్య నెలల తరబడి గొడవలు జరుగుతుండటంతో.. పాలక ఎన్సిపిలో అంతర్గత వైరం పరాకాష్టకు చేరుకుంది. దాంతో ఓలి ఈ
నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ఎన్సీపీ చైర్మన్ మరియు ప్రధానమంత్రి ఓలి నేతృత్వంలో ఒక వర్గం మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన
ప్రచండా నేతృత్వంలో మరో వర్గం ఏర్పడింది. నేపాల్ మాజీ ప్రధాని మాధవ్ కుమార్.. ప్రధాని ఓలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ
విరుద్ధమని పేర్కొన్నారు.
అధికార ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ప్రచండ మరియు మాధవ్ నేపాల్ వర్గం.. ఓలిని ప్రధాని పదవి
నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. గత జూన్ నెలలో నేపాల్ వ్యూహాత్మకంగా కీలకమైన మూడు భారతీయ భూభాగాలను కలుపుకొని దేశ
రాజకీయ పటాన్ని పునర్నిర్మించింది. ఆ తర్వాతే తనను బహిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓలి పేర్కొన్నారు.
కాగా.. పార్లమెంట్ రద్దు రాజ్యాంగ విరుద్దమని రాజ్యాంగ నిపుణులు పేర్కొన్నారు. నేపాల్ రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. మెజారిటీలో ఉన్న
ప్రధానమంత్రికి పార్లమెంటును రద్దు చేసే అధికారంలేదని వారు అంటున్నారు. మెజారిటీ సభ్యులు ఉన్నంతవరకు పార్లమెంటును రద్దు చేసే
నిబంధన లేదని రాజ్యాంగ నిపుణుడు దినేష్ త్రిపాఠి అన్నారు. ఇదిలావుండగా.. ప్రధాని తీసుకున్న నిర్ణయంతో.. ప్రధాన ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్
అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేపాలీ కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ జనతా పార్టీలు రాష్ట్రపతిని కోరాలని నిర్ణయించిన
మరుసటి రోజే పార్లమెంట్ రద్దు జరగడం చర్చనీయాంశంగా మారింది.
For More News..