నెట్ నెట్ వెంచర్స్ పిటిషన్లు కొట్టివేత...అప్పటి వరకు నిర్మాణం ఆపాలని ఆర్డర్

నెట్ నెట్ వెంచర్స్ పిటిషన్లు కొట్టివేత...అప్పటి వరకు నిర్మాణం ఆపాలని ఆర్డర్
  • బల్దియా స్పీకింగ్​ ఆర్డర్ ను సవాల్ చేస్తూ సిటీ కోర్టును ఆశ్రయించిన బిల్డర్లు 
  • రూల్స్​కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించాల్సిందేనని ఆదేశం  

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఈ ఏడాది జనవరి 24 జీహెచ్ఎంసీ జారీ  చేసిన స్పీకింగ్ ఆర్డర్‌‌ను రద్దు చేయాలని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నందగిరిహిల్స్ లోని నెట్ నెట్ వెంచర్ సిటీ స్మాల్ కేసేస్ కోర్టుని ఆశ్రయించగా, న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో జీహెచ్ఎంసీ వాదనలు విన్న చీఫ్ జడ్జి కె కుషా..నెట్ నెట్ వెంచర్స్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కట్టడాలను తొలగించాల్సిందేనని, అప్పటి వరకు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. 10 మీటర్ల సెట్‌‌బ్యాక్‌‌లు పాటించకపోవడం, ర్యాంప్, డ్రైవ్‌‌ వే నిర్మాణాలు, సెల్లార్లను 100 నుంచి -200 అడుగుల లోతుకు తవ్వడం. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా తప్పుడు అనుమతులు పొందడంతో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

భవనం ఎత్తు 15 మీటర్లకు బదులు 70 మీటర్లకు మించడం, స్టిల్ట్ ఫ్లోర్ల ఎత్తు 5 మీటర్లకు బదులు 4.5 మీటర్లుగా నిర్మించడం, ఎన్విరాన్‌‌మెంటల్ డెక్ ఎత్తు 6 మీటర్లకు బదులు 4.5 మీటర్లుగా నిర్మించడం, నందగిరి హిల్స్, ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వైపు సెట్‌‌బ్యాక్‌‌లను పాటించకపోవడం తదితర అంశాలపై కోర్టు తీర్పు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.  
నాలుగు ఫ్లోర్లకి పర్మిషన్ తో స్టార్ట్..2013లో నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్లతో మొదలైన నిర్మాణం 2023 వచ్చేసరికి జీ+13 ఫ్లోర్లు..5 స్టిల్ట్ ఫ్లోర్లు, ఒక సెల్లార్ కు అనుమతులు తీసుకునే వరకూ వెళ్లింది. సెల్లార్ల నుంచి మొదలుపెడితే స్టిల్ట్ ఫ్లోర్లు, దానిపైన ఫ్లోర్ల నిర్మాణంలోనూ రూల్స్​బ్రేక్​చేసింది. 

ప్రతి ఫ్లోర్​ను జీహెచ్ఎంసీ పర్మిషన్​ఇచ్చిన దానికంటే పెంచి కట్టేసింది. దీంతో విజిలెన్స్​ఎంక్వైరీ, కోర్టు కేసులు, అధికారుల విచారణల పేరిట12 ఏండ్ల కాలం గడిచిపోగా, ఎట్టకేలకు బిల్డింగ్ ను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ ఏడాది జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. అంతకు ముందు సెట్‌‌బ్యాక్ ప్రాంతంలో అనధికారికంగా ర్యాంప్​నిర్మించారని గత ఏడాది మార్చి 19న జీహెచ్‌‌ఎంసీ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఏప్రిల్10 స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారు.  మే 25న మరో ఆర్డర్‌‌తో నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. అయినా, స్పందించకపోవడంతో చివరగా ఈ ఏడాది జనవరి స్పీకింగ్ నోటీసు ఇచ్చారు. ముందుగా అనుమతులు ఇలా....2012లో పబ్లిక్ యాక్షన్ ద్వారా హెచ్ఎండీఏ నందగిరి హిల్స్​లో 4.748 ఎకరాలను అమ్మకానికి పెట్టగా, నెట్​నెట్​వెంచర్స్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. 

నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి అప్లై చేయగా 2013లో ఉన్న మున్సిపాలిటీ రూల్స్​ప్రకారం జీ +4తో పాటు 5 నుంచి 7 సెల్లార్ల వరకు నిర్మించుకోవచ్చని పర్మిషన్​ఇచ్చింది. కమర్షియల్ ​కాంప్లెక్స్​ నిర్మాణం కోసం నందగిరి హిల్స్ పరిధిలో ఉన్న హెచ్ఎండీఏకు చెందిన 4.748 ఎకరాలను, జూబ్లీహిల్స్​రోడ్​నంబర్​45లో ఉన్న లే అవుట్​లోని 865.42 గజాల విస్తీర్ణం ప్లాట్​ను ఒకే స్థలంగా చూపి నెట్ నెట్ సంస్థ అనుమతులు తెచ్చుకున్నది. 

జూబ్లీహిల్స్ లేఅవుట్​కు వర్తించే జీవో ఎంఎస్ నంబర్ 305ను నందగిరి హిల్స్​లోని 4.74 ఎకరాల స్థలానికి వర్తింపజేసింది. 2017 డిసెంబర్​7న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్​305 ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలను అనుమతిస్తారు. ఇంపాక్ట్ ఫీజు కడితే 45 మీటర్ల వరకు కట్టుకోవచ్చు. కానీ, నెట్ నెట్​సంస్థ ఈ రూల్స్​పాటించలేదు.  గ్రౌండ్ + 13 అంతస్తులు, 1 సెల్లార్, 5 స్టిల్ట్ ఫ్లోర్లతో 70 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం చేపట్టారు. 

పర్యావరణానికి ముప్పు...

నెట్​నెట్ వెంచర్స్ కమర్షియల్​ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ప్రాంతం.. కేబీఆర్ నేషనల్ ​పార్క్​కు అత్యంత సమీపంలో పర్యావరణపరంగా సున్నితమైన జోన్​లో ఉంది. పార్కుకు కేవలం 40 మీటర్ల పరిధిలో, 100 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి, 450 అడుగుల ఎత్తులో బిల్డింగ్స్ నిర్మించారు. 2,09,000 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీపర్పస్​ బిల్డింగ్​లో 6 వేల కార్లు, 2 వేల బైక్స్​పార్క్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. 

పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం1.5 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీ భవనాలు నిర్మిస్తున్నప్పుడు పబ్లిక్ హియరింగ్​తప్పనిసరి. కానీ ఇక్కడ అటువంటివేమి జరగలేదు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.