- టాప్లో ఉన్నోళ్లు ఉద్యోగుల రక్తం తాగుతారని కామెంట్స్
- మరోవైపు దేశాన్ని సూపర్ పవర్గా మార్చడానికి ఈ విధానాన్ని ఫాలో కావాలంటున్న కొంత మంది ఎంటర్ప్రెనూర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన కామెంట్స్ ట్విట్టర్లో డిబేట్కు దారి తీశాయి. కొంత మంది ఎంటర్ప్రెనూర్లు నారాయణ మూర్తిని సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది నెటిజన్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. దేశ ఎకానమీ చైనా, జపాన్, జర్మనీ మాదిరి సూపర్ పవర్గా మారాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఓ పాడ్కాస్ట్లో నారాయణ మూర్తి పేర్కొన్నారు. ‘దేశంలో వర్క్ ప్రొడక్టివిటీ చాలా తక్కువ.
ప్రొడక్టివిటీని పెంచకపోతే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేము’ అని 3ఆన్4 క్యాపిటల్ పాడ్కాస్ట్లో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ మోహన్దాస్ పైతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ఇది నా దేశమని, వారానికి 70 గంటలు పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అదే విధంగా యువత కూడా వారానికి 70 గంటలు పనిచేయాలని కోరారు. కానీ, నారాయణ మూర్తి ఆలోచన విధానాన్ని అందరూ సపోర్ట్ చేయడం లేదు. ఇండియన్ కమెడియన్ యాక్టర్ విర్ దాస్ ఆయన వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
‘జీవించడం చాలా కష్టమైనది. నువ్వో అమ్మాయిని కలుస్తావు. లవ్లో పడతావు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. కానీ, ఆమె తండ్రి మాత్రం వారానికి 70 గంటలు పనిచేయాలని కోరుతాడు. నువ్వు మరీ అంత కష్టపడి పనిచేయలేవు. జస్ట్ చిల్ అవుతూ ఇంగ్లండ్ను నడపాలనుకుంటావు’ అంటూ నారాయణ మూర్తి అల్లుడు, యూకే పీఎం రిషి సునక్ను ఉద్దేశించినట్టు కామెంట్ చేశారు. ‘నారాయణ మూర్తి చేసిన సలహాను యువత వినడం చూస్తుంటే ఆనందంగా ఉంది. గత 24 గంటల నుంచి నాన్స్టాప్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచన తప్పు అని నిరూపించడంలో వారానికి 70 గంటల టార్గెట్ను చేరుకుంటారు. అయినా ఇన్ఫోసిస్ ఉద్యోగుల శాలరీలు బాగున్నాయా? వారు 70 గంటలు పనిచేస్తున్నారా?’ అని అమిత్ భవాని అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
మరో యూజర్ ‘ఓవర్ వర్క్’ వలన తనపై ఒత్తిడి పెరిగిందని, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. ‘ఓవర్ వర్క్తో 38 ఏళ్లకే నాకు హార్ట్ఎటాక్ వచ్చింది. జీవితాంతం మెడిసిన్స్పై ఆధారపడాల్సి వస్తోంది. టాప్ పొజిషన్లో కూర్చొని లెక్చర్లు ఇచ్చే ఇటువంటి వ్యక్తుల మాటలు వినొద్దు’ అని పేర్కొన్నారు.
ఓకే అంటున్న ఎంటర్ప్రెనూర్లు
నారాయణ మూర్తి కామెంట్స్ను చాలా మంది ఎంటర్ప్రెనూర్లు సపోర్ట్ చేస్తున్నారు. చాలా జనరేషన్లు దేశాన్ని నిర్మించాయని, ఈ ఫలితాన్ని మన యువత ఒకే జనరేషన్లో సాధించాలని ఓలా క్యాబ్స్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం యువత కష్టపడాలని సలహా ఇచ్చారు. నారాయణ మూర్తి ఆలోచనకు మనస్పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందల్ ట్వీట్ చేశారు. 2047 నాటికి ఇండియాను సూపర్ పవర్గా చేయాలని, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పాటించకూడదని చెప్పారు.
టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నాని కూడా నారాయణ మూర్తికి సపోర్ట్ చేశారు. ‘ నారాయణ మూర్తి 70 గంటల కామెంట్పై నెటిజన్లు కోప్పడడాన్ని చూస్తున్నాను. ఆయన పని గురించి మాట్లాడాడంటే అది కేవలం కంపెనీల్లో పనిచేసే వారి కోసం మాత్రమే కాదని నా నమ్మకం. 70 గంటలు కంపెనీల్లోనే పనిచేయాలని ఆయన చెప్పలేదు. 40 గంటలు కంపెనీ కోసం పనిచేయండి. 30 గంటలు మీ కోసం పని చేసుకోండి. ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అయ్యేటట్టు 10 వేల గంటలు ఇన్వెస్ట్ చేయండి. మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా మారండి’ అని ఆయన కామెంట్ చేశారు. నారాయణ మూర్తి కామెంట్స్ యంగస్టర్స్ కోసమని, ముఖ్యంగా 30 ఏళ్ల లోపు ఉన్నవారు పాటించాలని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ మోహన్దాస్ పై పేర్కొన్నారు.
శాలరీ పరిస్థితేంటి?
చాలా మంది నెటిజన్లు సేమ్ శాలరీకే వారానికి 70 గంటలు పనిచేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. వీరు ఆయన కామెంట్స్ను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. అలా అని సపోర్ట్ కూడా చేయడం లేదు. బసంత్ మహేశ్వరి వెల్త్ అడ్వైజర్స్ ఫౌండర్ బసంత్ మహేశ్వరి ఓవర్టైమ్ పే గురించి చెప్పాలన్నారు. ఉద్యోగులకు వారానికి 70 గంటల పనికి శాలరీ ఇవ్వాలా? లేదా 48 గంటలకా? అని ఆయన ప్రశ్నించారు. నారాయణ మూర్తి సలహాను పాటించడం కష్టమని ప్రాజెక్ట్ఫిట్ కో ఫౌండర్ చిరాగ్ బర్జతియా ట్వీట్ చేశారు.
‘అందరి ఇళ్లులు ఆఫీస్కు దగ్గరలో ఉండవు. అందరూ కారు, డ్రైవర్ను అఫోర్డ్ చేయలేరు. అందరూ బైక్ నడపడాన్ని సేఫ్గా భావించరు. మన ట్రాఫిక్ రూల్స్, సిస్టమ్ బాగోలేదు. అకౌంటబిలిటీ లేదు’ అని పేర్కొన్నారు. వారానికి 70 గంటల పనితో వర్క్–లైఫ్ బ్యాలెన్స్ పోతుందని, తక్కువ శాలరీ, పెరిగిన లివింగ్ కాస్ట్ వంటి కారణాలతో ఈ విధానాన్ని అమలు చేయడం కష్టమని కొంత మంది నెటిజన్లు చెబుతున్నారు.