న్యూఢిల్లీ: మోడీ ఫస్ట్టర్మ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన సుష్మా స్వరాజ్ ఈసారి మంత్రి వర్గంలో కనిపించలేదు. దీంతో ఆమెను మిస్ అవుతున్నామంటూ ప్రముఖులు, నెటిజన్లు ట్వీట్లు చేశారు. “దేశ ప్రజలు క్యాబినెట్లో మిమ్మల్ని కచ్చితంగా మిస్ అవుతారు మేడం. మినిస్ట్రీని భావోద్వేగాలు, విలువలతో నింపేశారు” అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. “మీరు చాలా మంచి పనులు చేశారు మేడం. మీ సాయం పొందిన వాళ్లు మిమ్మల్ని మర్చిపోరు” అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. విదేశాల్లోని ఇండియన్లతో పాటు విదేశీయులకూ సుష్మా స్వరాజ్ సాయం చేసేవారు. వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడేలా కృషి చేశారు. ఐక్యరాజ్యసమితి వ్యవహారాల్లో చురుగ్గా పనిచేశారు. దీంతో వివిధ దేశాల విదేశాంగ శాఖలోని నేతలు కూడా ఆమెను మిస్ అవుతున్నట్లు ట్వీట్లు చేశారు. మంత్రి వర్గంలో చోటు దక్కని మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మోడీ మంత్రి వర్గంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని, ఐదేళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన ట్వీట్ చేశారు.
“ట్వీట్ల ద్వారా పాస్పోర్ట్ సమస్యలు పరిష్కరించలేం”
మోడీ 2.0లో విదేశాంగ మంత్రిగా ఎంపికైన జయశంకర్ కొడుకు మొదటిరోజే వార్తల్లో నిలిచారు. పాస్పోర్ట్కు సంబంధించి ఒక నెటిజన్ ఆయనకు ట్వీట్ చేయగా.. చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. “పాస్పోర్ట్, వీసాలు, ఫారిన్ నుంచి బయటికి వచ్చేందుకు నేను ఎవరికి హెల్ప్ చేయలేను. నన్ను ఎవరూ అడగవద్దు. నాకే చాలా సమస్యలు ఉన్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు.