
అలా మూడు ముళ్లు పడ్డాయో లేదో.. పెద్దలు.. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. ఇది సహజం.. అలాంటి పెద్దల మాట నిజం చేయడానికి కొత్త దంపతులు సంతానం కోసం పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి పుత్రదాఏకాదశి అంటారు. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. ఆరోజు కొత్త దంపతులు ఎలా పూజ చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
కొత్తగా పెళ్లయిన దంపతులు పుత్ర ఏకాదశి వ్రతం చేయాలని పండితులుచెబుతున్నారు . ఈ వ్రతం సంతానం కోసం చేసే ఒక ముఖ్యమైన వ్రతమని పురాణాల ద్వారా తెలుస్తుంది. దంపతులు ఈ వ్రతాన్ని భక్తితో, నియమనిష్టలతో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. పుత్రద ఏకాదశి వ్రతం ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
హిందూ ఆచారాలలో ఏకాదశులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది ( 2025) ఆగస్టు 5న పుత్రద ఏకాదశి వచ్చింది. ఈరోజు భక్తిభావంతో ఉపవాసం పాటించి విష్ణువుని పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలగుతాయని భక్తుల నమ్ముతారు.
సంతానం లేనివారు, సంతానం కలగాలని కోరుకునే వారు, తమ బిడ్డలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఆగస్ట్ 5న పుత్రదా ఏకాదశి వ్రతం పాటించనున్నారు. తమ పిల్లలు దీర్ఘాయుష్షు పొందాలని, సంతానం పొందాలని ఆకాంక్షిస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
సంతాన ఏకాదశి పూజా విధానం
- సూర్యోదయానికి ముందే వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈరోజు ( ఆగస్టు 5) భక్తితో ఉపవాసం ఆచరించాలి.
- విష్ణువు విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పూజా మందిరంలో పీట మీద ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద పెట్టాలి.
- ఆవునెయ్యితో దీపం వెలిగించి, పూలు, స్వీట్లు దేవుడికి సమర్పించాలి.
- తులసి పత్రంతో పాటు పంచామృతాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. ఈ పూజలో తప్పనిసరిగా తులసి పత్రం ఉండాలి. లేదంటే పూజ అసంపూర్ణంగా భావిస్తారు.
- సూర్యాస్తమయానికి ముందే పూజ చేసి విష్ణువుకి భోగం సమర్పించాలి.
- విష్ణు సహస్రనామ పారాయణం, హరి స్తోత్రం పఠించాలి.
- విష్ణుమూర్తి దీవెనల కోసం తప్పకుండా ఆలయానికి వెళ్ళి పూజలు చేయాలి.
- ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పుత్రద ఏకాదశి కథ విన్నా తర్వాత ఉపవాసం విరమించుకోవాలి.
- దంపతులు దగ్గరిగానే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ.. స్వామిని ధ్యానిస్తూ రోజంతా గడపాలి.
సంతాన ఏకాదశి ( ఆగస్టు 5) రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ తులసి ఆకులు తుంచకూడదు. అది అశుభంగా పరిగణిస్తారు.
- మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని ముందు రోజు నుంచే తీసుకోవడం మానేయాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
- ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకూడదు.
- వీలైనంత వరకు మనసు దేవుడి మీద లగ్నం చేసి భగవంతుని నామ స్మరణ చేస్తూ ఉండాలి.
పుత్రద ఏకాదశి కథ
హిందూ పురాణాల ప్రకారం పూర్వం భద్రావతి రాజ్యాన్ని సుకేతుమన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శైవం భార్య. తమకి పిల్లలు లేరని చనిపోయిన తర్వాత శ్రార్థ ఖర్మలు చేసేందుకు కూడా కొడుకు లేడని ఆలోచిస్తూ కుంగిపోయారు. ఈ మనోవేదనతో రాజు రాజ్యం వదిలి అడివి బాట పట్టాడు. అడవిలో ఉన్న రుషులు కొందరు రాజు బాధకి గల కారణం అడిగి తెలుసుకున్నారు.
►ALSO READ | Plastic Risk: ప్లాస్టిక్ సంచుల్లో కూరగాయలు ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా.. మీ ఆరోగ్యం రిస్క్ లో పడ్డట్టే..!
సంతానం లేదని చెప్పడంతో రుషులు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సూచిస్తారు. వారి సూచనల మేరకు సుకేతు రాజు తన భార్యతో కలిసి పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఫలితంగా వారికి విష్ణుమూర్తి ఆశీస్సులతో పుత్రుడు జన్మిస్తాడు.