
‘రోటి కపడా రొమాన్స్’ చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన సుప్రజ్.. నటిస్తున్న తాజా చిత్రం ‘పయనం’. చందురామ్ దర్శకత్వంలో స్వర్ణ కమల నిర్మిస్తున్నారు. ‘జనక అయితే గనక’ ఫేమ్ సంగీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కొరియోగ్రాఫర్ రఘు క్లాప్ కొట్టగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచాన్ చేశాడు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త కాన్సెప్ట్తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. ఆడియెన్స్ను సర్ప్రైజ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రలో కనిపిస్తారు’ అని చెప్పాడు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. జులై 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. ఆమని, మైమ్ మధు, మెహబూబ్ భాషా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు.