ఇండోర్: వ్యవసాయ యంత్రాల కంపెనీ జాన్ డీర్ ఇండియా మార్కెట్లోకి సోమవారం కొత్తగా ఏడు ట్రాక్టర్, హార్వెస్టర్ మోడల్స్ను విడుదల చేసింది. మనదేశ సాగుపద్ధతులు, వాతావరణాలకు అనుగుణంగా వీటిని తయారు చేశామని ప్రకటించింది. 5405 గేర్ ప్రో 63 హెచ్పీ హార్వెస్టర్లో టిల్ట్ స్టీరింగ్, టీఎస్ఎస్ ట్రాన్స్మిషన్ వంటి టెక్నాలజీలు ఉండటం వల్ల పంట కోతలు, లోడింగ్, డోజింగ్, రవాణా వంటి పనులను సులువుగా చేయవచ్చు. 5105 మోడల్ ఇండియాలోనే మొట్టమొదటి 40 హెచ్పీ ట్రాక్టర్. పొడి, తడి పొలాల్లో వ్యవసాయ పనులకు ఇది అనుకూలం. 33 హెచ్పీ విభాగంలోని 5005 మోడల్ భారీ వస్తువులను సులువుగా ఎత్తగలుగుతుంది. గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
‘‘మనదేశ వ్యవసాయరంగంపై సంపూర్ణ పరిశోధన జరిపి ట్రాక్టర్లను తయారు చేశాం. తక్కువ ఖర్చుతో సాగు పనులను చేసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు, కౌలుదారులకు ఇవి అనుకూలం’’ అని జాన్డీర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ రాజేశ్ సిన్హా అన్నారు. గత రెండు దశాబ్దాల్లో తమ కంపెనీ పవర్ స్టీరింగ్, ఆయిల్ డిస్క్బ్రేకులు, ప్రానెటరీ రిడక్షన్, ఫోర్స్ ఫీడ్ లూబ్రికేషన్, హైటార్క్ వంటి టెక్నాలజీలను తీసుకొచ్చిందని కంపెనీ ఎండీ సతీశ్ నడిగర్ అన్నారు.