మౌంట్ మాంగనుయ్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ వీర విహారం చేశాడు. కేవలం 51 బంతుల్లో 111 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రిషభ్ పంత్ ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సూర్య మొదటినుంచి దూకుడుగా ఆడాడు.
భారత బ్యాట్స్ మెన్ లలో ఇషాన్ కిషన్ (36), రిషభ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్య (13) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ సౌథీ హ్యాట్రిక్ విశేషం. సౌథీ కెరీర్లో ఇది రెండో హ్యాట్రిక్. సౌథీ వేసిన 19వ ఓవర్ లో వరుస బంతుల్లో హార్దిక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ వికెట్లను తీశాడు. ఇక ఫెర్గూసన్ 2 వికెట్లు, సోదీ ఒక వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.