- ఫఖర్ జమాన్ మెరుపు సెంచరీ
- కివీస్కు వరుసగా నాలుగో ఓటమి
బెంగళూరు: తొలుత ఫోర్లు, సిక్సర్ల మోత.. తర్వాత వానతో తడిచిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ పెర్ఫామెన్స్ చేసి సెమీఫైనల్ రేసులోకి వచ్చింది. పేలవ బౌలింగ్తో ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్నా ఫఖర్ జమాన్ (81 బాల్స్లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 126 నాటౌట్) మెరుపు సెంచరీకి తోడు వాన దేవుడి అండతో శనివారం జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 21 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. టోర్నీలో నాలుగో విక్టరీతో ఐదో ప్లేస్లోకి వచ్చి సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. వరుసగా నాలుగో మ్యాచ్లో ఓడిన న్యూజిలాండ్ నాలుగో ప్లేస్లో కొనసాగుతోంది. వాన అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు వచ్చిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 401/6 స్కోరు చేసింది. తన తండ్రి సొంతూరులో రాచిన్ రవీంద్ర (94 బాల్స్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 108) సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (79 బాల్స్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) తో రెండో వికెట్కు 180 రన్స్ జోడించాడు. మిడిలార్డర్లో డారిల్ మిచెల్ (29), చాప్మన్ (39), ఫిలిప్స్ (41), శాంట్నర్ (26 నాటౌట్) కూడా రాణించడంతో కివీస్ వరల్డ్ కప్లో తొలిసారి 400 మార్కు అందుకుంది. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం మూడు వికెట్లు తీశాడు. భారీ టార్గెట్ ఛేజింగ్లో రెండో ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (4)ను సౌథీ ఔట్ చేయగా తొలి పవర్ ప్లే తర్వాత వాన రావడంతో మ్యాచ్ను 41 ఓవర్లకు కుదించిన అంపైర్లు పాక్ టార్గెట్ను 342 రన్స్గా లెక్కగట్టారు. డక్వర్త్ను దృష్టిలో ఉంచుకొని జమాన్ ఓ రేంజ్లో చెలరేగాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (63 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్) సపోర్ట్ ఇవ్వగా జమాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని జోరుతో 25.3 ఓవర్లకు పాక్ 200/1తో నిలిచిన టైమ్లో మళ్లీ వాన మొదలై ఎంతకీ తగ్గలేదు. దాంతో డక్వర్త్ ప్రకారం అప్పటికి టార్గెట్ను 180 రన్స్గా లెక్కగట్టారు.21 పరుగుల ముందంజలో నిలిచిన పాక్ మ్యాచ్ గెలిచింది. జమాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ (63 బాల్స్ లో) చేసిన పాక్ ప్లేయర్గా ఫఖర్ జమాన్ రికార్డు సృష్టించాడు.
- ఆడిన తొలి వరల్డ్కప్లోనే మూడు సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్గా రాచిన్ రవీంద్ర రికార్డుకెక్కాడు. 25 ఏండ్లలోపే వరల్డ్ కప్లో మూడు సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ (రెండు)ను అధిగమించాడు.
ఒక బెర్త్.. మూడు జట్లు
ఇండియా (14 పాయింట్లు)సెమీస్ చేరగా ఈ పోరులో పాక్ విక్టరీతో సౌతాఫ్రికా (12) కూడా నాకౌట్ చేరింది. ఇంగ్లండ్పై గెలి చిన ఆసీస్ (10 పాయింట్లతో మూడో ప్లేస్)కు అఫ్గాన్, బంగ్లాతోరెండు మ్యాచ్లు ఉన్నాయి. ఒక్కటి గెలిచినా ఆ టీమ్ బెర్తు ఖాయం అనొచ్చు. దాంతో, నాలుగో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. మూడు టీమ్స్ ఎనిమిదేసి పాయింట్లతో వరుసగా 4,5,6వ స్థానాల్లో ఉన్నాయి. అఫ్గాన్కు మరో రెండు మ్యాచ్లు (ఆసీస్, సౌతాఫ్రికాతో) ఉండటం అడ్వాంటేజ్ కానుంది. తమ చివరి పోరులో శ్రీలంకతో కివీస్, ఇంగ్లండ్తో పాకిస్తాన్ పోటీ పడనున్నాయి.