- బైక్పై వస్తూ పాదచారిని ఢీకొట్టి పడిపోయిన భార్యాభర్తలు
- పై నుంచి లారీ వెళ్లడంతో దుర్మరణం
రామాయంపేట/ మేడ్చల్, వెలుగు : మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నవ దంపతులు సోమవారం తెల్లవారు జామున మేడ్చల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పట్టణానికి చెందిన జ్యోతి, శ్రీనివాస్ దంపతుల పెద్ద కొడుకు సాయిరాజ్ (25) హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఎంప్లాయ్. ఇతడికి సారిక (24) తో ఆరు నెలల క్రితం పెండ్లి జరిగింది. ఇద్దరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. వీకెండ్కావడంతో రామాయంపేటకు వచ్చారు. ఆదివారం రాత్రి నిమజ్జనంలో పాల్గొని సోమవారం తెల్లవారుజామున బైక్ మీద హైదరాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యలో మేడ్చల్ బస్ డిపో వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లికి చెందిన నవీన్ రెడ్డి(34)ని వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిరాజ్, సారిక కిందపడ్డారు. అదే టైమ్ లో ఇనుప చువ్వల లోడ్ తో వస్తున్న ఓ లారీ వీరిపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వీరి బైక్ ఢీకొట్టి గాయపడ్డ నవీన్రెడ్డి కూడా చనిపోయాడు. ఈ ప్రమాదం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.