చురుగ్గా ఫోర్ లేన్ పనులు.. నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ సమస్య

చురుగ్గా ఫోర్  లేన్ పనులు.. నిజామాబాద్–జగదల్  పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్  సమస్య
  • తొలగిన అటవీ శాఖ అడ్డంకులు  
  • మంచిర్యాల తోళ్లవాగు నుంచి రసూల్​పల్లి వరకు 9.8 కి.మీ. రహదారి విస్తరణ
  • నిజామాబాద్–జగదల్​ పూర్​ మధ్య తీరనున్న ట్రాఫిక్​ సమస్య

నస్పూర్​/కోల్​బెల్ట్, వెలుగు:  నిజామాబాద్–జగదల్​పూర్(చత్తీస్​గఢ్)-63 రహదారిలోని మంచిర్యాల పట్టణం తోళ్లవాగు నుంచి జైపూర్​మండలం రసూల్​పల్లి వరకు 9.8 కిలోమీటర్ల ఫోర్​లేన్ రహదారి విస్తరణ చురుగ్గా సాగుతోంది. అటవీశాఖ అడ్డంకులు తొలిగిపోవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.

 మంచిర్యాల నుంచి చెన్నూరు, సిరొంచా(మహారాష్ట్ర) వైపు రాకపోకలకు నేషనల్​హైవే 63 రహదారి ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. నిజామాబాద్–జగదల్​పూర్​రహదారిపై భవిష్యత్తులో ట్రాఫిక్​ మరింత పెరిగే అవకాశం ఉంది. రోడ్డు ఇరుగ్గా ఉండటంతో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్​పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 

రూ.59.79 కోట్లు మంజూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం వార్షిక ప్రణాళిక(2021–-22)లో 7 బ్లాక్​ స్పాట్స్​వద్ద రోడ్డు విస్తరణ, ఆధునీకరణ, భూసేకరణ కోసం రూ.59.79 కోట్లు మంజూరు చేసింది. తోళ్లవాగు నుంచి రసూల్​పల్లి వరకు ఫోర్​లేన్, డివైడర్లు, యూటర్న్​లు, సెంట్రల్​లైటింగ్​పనులు చేపట్టాల్సి ఉంది. అయితే శ్రీరాంపూర్​శివారు నుంచి ఒకవైపు అటవీ భూమి ఉంది. బీఆర్ఎస్​హయాంలో మాజీ సీఎం కేసీఆర్​పర్యటన ఉందని ఆఫీసర్లు వేగంగా పనులు పూర్తి చేసేందుకు అనుమతులు లేకుండానే ఇందారం అటవీ బీట్ పరిధిలో రోడ్డు తవ్వారు.

 దీనిపై అటవీ ఆఫీసర్లు కేసు నమోదు చేస్తూ యంత్రాలను సీజ్ చేసి జరిమానా విధించారు. అధికారులకు అటవీ భూమి తెలియదని, కేసు తీసేయాలని కోరగా.. కాంట్రాక్టర్​పై నిబంధనల ప్రకారం కాకుండా నామమాత్రంగా జరిమానా విధించారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. తర్వాత రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. కేసు తొలగించాలంటూ జనవరిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఎన్ హెచ్ ఆఫీసర్లు విన్నవించినా ఫలితం లేకపోయింది.

తొలగనున్న వాహనదారుల ఇక్కట్లు

ఫోర్​లేన్​రహదారి విస్తరణ అటవీ శాఖ అడ్డంకులతో ఏడేండ్లుగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్​స్పాట్స్​లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ రహదారి విస్తరణకు అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. శ్రీరాంపూర్​బస్టాండ్ నుంచి జైపూర్​మండలం రసూల్​పల్లి వరకు ఫారెస్ట్​ఆఫీసర్లు సరిహద్దు రాళ్లను బిగించారు. 

మరోవైపు నేషనల్​హైవే ఆఫీసర్లు మీటర్ లోతు, 3.75 మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. శ్రీరాంపూర్​బస్టాండ్​నుంచి రసూల్​పల్లి వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు పర్మిషన్​వచ్చినట్లు మంచిర్యాల ఎఫ్​డీవో రత్నాకర్ తెలిపారు. పనులు పూర్తయితే వాహనదారుల ఇక్కట్లు తొలగనున్నాయి.