రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రాథమిక అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితులను పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేసినట్లు సమాచారం. హై ప్రొఫైల్ కేసులో అధికారులు ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ జరగగా పది మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు.
చుట్టుపక్కల ఉన్న 1,000కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన ఎన్ఐఏ ప్రధాన నిందితుడిగా ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్గా గుర్తించింది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పేలుడు సూత్రధారులు అబ్దుల్ మతీన్ తాహా, మసవీర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి రివార్డులను ఎన్ఐఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఫొటోలను విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.