
- నైజీరియా పోలీసులు, ఆర్మీపై ఆరోపణలు
- పోలీసులపై 14 రోజుల్లో 150 కంప్లైంట్లు
అబ్యూజా: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ప్రజలు బయట తిరగొద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించాయి. బయటకు వస్తే కేసులు పెట్టి, శిక్ష విధిస్తామని హచ్చరించాయి. నైజీరియా పోలీసులు శిక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ బ్రేక్ చేశారని ఇప్పటి వరకు 18 మందిని కాల్చి చంపారు. నైజీరియాలో 407 కరోనా కేసులు పాజిటివ్ రాగా.. 12 మంది చనిపోవడంతో మార్చి 30న అక్కడ లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత దాన్ని మరో 14 రోజులకు పొడిగిస్తూ ఉతర్వులు జారీ చేశారు. కాగా.. మార్చి 30 నుంచి ఈ నెల 13 వరకు లాక్డౌన్ బ్రేక్ చేసిన 18 మందిని పోలీస్ ఫోర్స్, ఆర్మీ కాల్చి చంపేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పింది. కరోనా వచ్చి చనిపోయిన వారి కంటే.. లాక్డౌన్ బ్రేక్ చేయడం వల్ల కాల్చేసిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. లాక్డౌన్ విధించిన రెండు వారాల్లోనే 150 మానవ హక్కుల ఉల్లంఘన కంప్లైంట్లు వచ్చాయని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. పోలీసులు, ఆర్మీ ఫోర్స్ తరచూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోరాడతామని ఎన్హెచ్ఆర్సీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.