లీడర్ల భూముల కోసం మారిన నిర్మల్​ మాస్టర్​ ప్లాన్

లీడర్ల భూముల కోసం  మారిన నిర్మల్​ మాస్టర్​ ప్లాన్
  •    మొదట ఇండస్ట్రియల్ జోన్ లో సోఫీనగర్ 
  •     కొత్త మాస్టర్ ప్లాన్ లో కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి
  •     ప్రస్తుతం ఇండస్ట్రియల్ జోన్ లో మంజులాపూర్, తల్వేద
  •     ఆందోళన చెందుతున్న రైతులు 
  •     ఏలేటి ఆమరణదీక్షతో ఉద్రిక్తత

నిర్మల్, వెలుగు : నిర్మల్ పట్టణాభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ​ప్లాన్, కొద్ది రోజులకే మారిపోవడం వివాదాస్పదమవుతున్నది. మొదట ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ప్రాంతాలు,  కొత్త మాస్టర్ ప్లాన్ లో కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి రావడం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ లోకి వచ్చిన ప్రాంతాల్లోని రైతులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఎన్ని ఆందోళనలు చేసినా ఆఫీసర్లు స్పందించకపోవడంతో చివరకు బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా బీజేపీ శ్రేణులు శుక్రవారం నిర్మల్ ​పట్టణ బంద్​కు పిలుపునివ్వగా వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.  

అసలు కథ ఇదీ..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ ప్రాంతం 1990 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉండేది. ఈ భూములను పరిశ్రమల స్థాపన కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాణిజ్య సముదాయాలు, నివాస గృహాల నిర్మాణాలకు అనుమతులుండవు. కానీ, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో సమాచారం తెలుసుకున్న నిర్మల్​ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, బీఆర్ఎస్ లీడర్లు ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ లోని భూములను తక్కువ ధరకు కొన్నారు. పాత మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం ఆ భూముల రిజిస్ట్రేషన్లు కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థల పేరిటే జరగాల్సి ఉంటుంది. కొత్త మాస్టర్ ప్లాన్ కోసం నోటిఫికేషన్ జారీ కాగానే వీరంతా అప్రమత్తమై మాస్టర్ ప్లాన్ నుంచి ఇండస్ట్రియల్​జోన్​ అయిన సోఫీనగర్​ ప్రాంతాన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చేశారు. కొత్తగా మంజులాపూర్, తల్వేద గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ లోకి చేర్చారు. దీనిపై అప్పట్లోనే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు ఆ అభ్యంతరాలు స్వీకరించి రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. రైతుల ఆందోళనలు ఉధృతం కావడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొత్త మాస్టర్​ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

అధికార పార్టీ లీడర్ల ‘కొత్త’ ప్లాన్​ 

ఇండస్ట్రియల్ జోన్​లో ఉన్న భూములను అప్పట్లో తక్కువ ధరకు కొన్న ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, ఆ జోన్లను కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చుకునేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్​మెంట్​నుంచి జీవో నెంబర్ 220 ను జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ జీవో గుట్టుచప్పుడు కాకుండా గత డిసెంబర్ మూడున జారీ అయింది. కొత్తగా మున్సిపల్ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఫార్మల్ అప్రూవల్ చేశామని, ఫైనల్ అప్రూవల్ అయ్యేవరకు ఈ ఫార్మల్ అప్రూవల్ కొనసాగుతుందని జీవోలో పేర్కొన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ ఫైనల్ అప్రూవల్ మాస్టర్ ప్లాన్ లో పరిగణలోకి  తీసుకుంటామని కూడా జీవోలో స్పష్టం చేశారు. కానీ, కొత్త మాస్టర్ ప్లాన్ ను ఫార్మల్ అప్రూవల్ గా జీవోలో పేర్కొనడంతో సోఫీనగర్ ఇండస్ట్రియల్ భూములు కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, బీఆర్ఎస్ లీడర్లు సోఫీనగర్  సర్వే నెంబర్ 258/3 లో ఎనిమిది ఎకరాల భూమిని తక్కువ ధరకు కొని  అందులో రెండు ఎకరాలను రూ.20 కోట్లకు డీమార్ట్ కు అమ్మేసినట్లు చెబుతున్నారు. కొత్త జీవో ఆధారంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కాగా, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న మంజులాపూర్, తల్వేద వ్యవసాయ భూముల్లోకి మార్చిన ఇండస్ట్రియల్ జోన్ ను ఎత్తేయకుండానే సోఫీనగర్ లోని ఇండ స్ట్రియల్ జోన్ ఎత్తేయడం వివాదానికి కారణమవుతోంది. దీనిపై రైతులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. 

రైతులు ఆందోళన చెందవద్దు

మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చెందవద్దని మున్సిపల్ చైర్మన్​ ఈశ్వర్​ అన్నారు. మంజులాపూర్, తల్వేద ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ పై రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఫైనల్ అప్రూవల్ మాస్టర్ ప్లాన్ లో సరిచేస్తామన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది మాస్టర్ ప్లాన్ రూపొందుతుందన్నారు.   

మూడో రోజుకు చేరిన దీక్ష

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరానికి తరలివచ్చి మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్లు మహేశ్వర్​ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తాను దీక్షను విరమించబోనని  మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నిర్మల్​వచ్చి మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.  రఘునందన్​ మాట్లాడుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకే కొత్త మాస్టర్ ప్లాన్ అమలవుతోందని ఆరోపించారు. గతంలో కామారెడ్డిలో ఇలాగే జోన్లను రూపొందిస్తే ప్రజా పోరాటంతో రద్దు చేయించామన్నారు.  మంత్రి నీతివంతుడైతే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు సిద్ధం కావాలని సవాల్​విసిరారు. సొంత గ్రామం ఎల్లపెల్లిలోని భూముల విలువలు అమాంతం పెంచేందుకు ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ నుంచి కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ గా మార్చుకొని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్వలాభం కోసమే కలెక్టరేట్​ను తన గ్రామ సమీపంలో నిర్మించాడన్నారు. అయ్యన్న గారి భూమయ్య,  రావుల రాంనాథ్, సాదం అరవింద్,  సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు పాల్గొన్నారు.  

నిర్మల్ బంద్ సక్సెస్...

 ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ శుక్రవారం నిర్మల్ బందుకు పిలుపునివ్వగా స్వచ్ఛందంగా దుకాణాలు, హోటల్స్ , సినిమా థియేటర్లు మూసివేశారు. బీజేపీ కార్యకర్తలు నిర్మల్ లో బైక్ ర్యాలీ నిర్వహించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పలుచోట్ల వాగ్వాదం చోటు చేసుకుంది. వివిధ మండల కేంద్రాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు.

నేడు నిర్మల్ కు బండి సంజయ్ రాక..

మహేశ్వర్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ శనివారం నిర్మల్ కు  రాను న్నట్లు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.