ఈ సారి బడ్జెట్ను కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టనుంది. బండెడు బడ్జెట్ పుస్తకాలు ఉండవు. అంతా ఆన్లైనే. యాప్లోనే రిలీజ్ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలకు ఇది వరుసగా మూడో బడ్జెట్. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో అన్ని రంగాలు మస్తు ఆశలు పెట్టుకున్నాయి. ఎకానమీని గాడిలో పెట్టేందుకు కేంద్రం ఏ నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్పైనే ప్రతి ఒక్కరి చూపు. కరోనా తర్వాత వస్తోన్న తొలి బడ్జెట్ కాబట్టి కాస్త ఆశలు, అంచనాలు అన్ని రంగాల నుంచి ఎక్కువగానే ఉన్నాయి. పన్ను ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఒక్కో రంగానికి ఒక్కో కోరికగా ఉంది. తమకు కావాల్సిన డిమాండ్లను, కోరికలను అన్నింటిన్ని బడ్జెట్ ప్రిపరేషన్కు ముందే నిర్మలమ్మకు విన్నవించుకున్నారు. ఇంత క్లిష్టసమయంలో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రిపేర్ చేయడం కాస్త సవాలుగానే మారింది. కుదేలైన ఎకానమీ గాడిలో పడేసే బాధ్యతంతా నిర్మలమ్మ చేతిలోనే ఉంది. గ్రోత్ను రివైవ్ చేయడంలో నిర్మలమ్మనే కీలక పాత్ర పోషించనున్నారు. పడిపోతున్న రెవెన్యూలను కాపాడుకుంటూ.. ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ప్రజల హెల్త్పై ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంది. కరోనా మహమ్మారి తర్వాత దేశాన్ని తిరిగి నిర్మించేలా ఈ బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ ఇంతకుముందే చెప్పారు.
నిర్మలా సీతారామన్ సరిగ్గా ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పూర్తిగా పేపర్లెస్గా వస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బడ్జెట్ డాక్యుమెంట్లను ప్రింట్ చేయకూడదని నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకంగా నిలవబోతుంది. ఇండిపెండెంట్ ఇండియా చరిత్రలో తొలిసారి బడ్జెట్ పేపర్లెస్గా రాబోతుంది. అంటే బడ్జెట్ పేపర్లను ఈసారి ప్రింట్ చేయలేదు. ఎకనమిక్ సర్వే మాదిరి బడ్జెట్ను కూడా ట్యాబ్లో తీసుకొస్తారో చూడాల్సి ఉంది. బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారులందర్ని ఎంతో సీక్రెసీగా ఉంచుతారు. వారికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కనీసం ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడరు. కేవలం హై ర్యాంక్ అధికారులకు మాత్రమే కొంత యాక్సస్ ఉంటుంది. అయితే ఈ సారి పేపర్లెస్గా వస్తుండటంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎలాంటి లాక్డౌన్ లేదు. పేపర్లెస్ బడ్జెట్తో సీక్రెసీ ఎక్సర్సైజ్ ఏమీ జరుగలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్ విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సంప్రదాయబద్ధంగా బడ్జెట్ పేపర్లను బ్రీఫ్కేసులో పట్టుకురావడాన్ని నిర్మలా సీతారమన్ పక్కన పెట్టి… గత సంవత్సరం ఎర్రటి రంగు వస్త్రంలో లెడ్జెర్ను పట్టుకుని వచ్చారు. అలాగే బడ్జెట్ తేదీలు కూడా ఫిబ్రవరి 1కి మారాయి. అంటే ఒక నెల ముందుకు జరిగాయి. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతేడాది బడ్జెట్లో ఏదో ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటూ దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. హల్వా మాదిరి ఈ సారి బడ్జెట్ స్వీట్గా ఉంటుందో.. లేదో ఇక చూడాల్సి ఉంది…