
నితిన్ యాక్షన్ డ్రామా తమ్ముడు మూవీ ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోతుంది. జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు నాలుగు రోజుల్లో రూ.5 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మొదటి రోజు ఇండియా వైడ్ గా రూ.1.9 నెట్ వసూళ్లు రాబట్టింది. అయితే, వారాంతంలో ఆ ఊపు నిలకడగా లేదు. శనివారం, కలెక్షన్లు దాదాపు 39% తగ్గి రూ.1.16 కోట్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆదివారం రూ.1.28 కోట్లతో స్వల్పంగా రాణించింది. ఇక సోమవారం కూడా బుకింగ్స్లో ఎలాంటి దూకుడు లేదు.
ఈ క్రమంలోనే ఆఫ్లైన్, ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ పెద్దఎత్తున ఖాళీ సంఖ్యలే కనిపిస్తున్నాయి. దాంతో సినిమా అంచనాలను అందుకోవడం కష్టమే అని ఇండిస్ట్రీ వర్గాల్లో టాక్ మొదలైంది. ఇకపోతే, వరల్డ్ వైడ్గా తమ్ముడు 950 వరకు థియేటర్లలో విడుదలైంది. అయినప్పటికీ, వసూళ్లలో రాణించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తమ్ముడు బిజినెస్&బ్రేక్ఈవెన్ టార్గెట్?
తమ్ముడు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 50 కోట్ల గ్రాస్ రావాల్సిఉందని నిపుణులు అంచనా వేశారు. సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేసినప్పటికీ.. కథలో కంటెంట్ లేకపోవడం వల్ల వసూళ్లలో వేగం పెంచలేకపోతుంది. ఇకపోతే, తమ్ముడు మూవీ ప్రమోషన్స్తో కలిపి దాదాపు రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే..
నైజాంలో రూ.8.5 కోట్లు,
సీడెడ్లో రూ.3 కోట్లు,
ఆంధ్రాలోని ఇతర ప్రాంతాల హక్కులు రూ.8.5 కోట్లు.
మొత్తంగా ఆంధ్రా, నైజాంలలో తమ్ముడు సినిమాకు రూ.20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ రూ.4 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మరి తమ్ముడు మూవీకి బ్రేక్ ఈవెన్ రాబట్టడం పక్కకు ఉంచితే.. నష్టాలూ ఎన్ని కోట్లలో వస్తాయనే అంచనా మొదలైంది.