
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. జులై 4న సినిమా విడుదల కానుంది. బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ‘మా దర్శకుడు వేణు నాలుగేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఎక్కువగా ఫారెస్ట్లో షూట్ చేశాం. నా కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘దిల్’ చిత్రానికి రాజు గారు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారు. మళ్లీ ఈ చిత్రానికి నా కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేశారు.
ఆ సినిమా తరహాలోనే ఇది కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. ఇరవై ఏళ్ల తర్వాత ‘తమ్ముడు’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని లయ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే నాలుగేళ్లు చాలా కష్టపడ్డాడు. అక్కా, తమ్ముడి మధ్య జరిగే కథ అయినప్పటికీ కొత్త కాన్సెప్ట్తో ఉంటుంది. లయ గారు మా సంస్థ ద్వారా రీఎంట్రీ ఇవ్వడం హ్యాపీ.
అలాగే నితిన్కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ‘కాంతార’ తర్వాత సప్తమి గౌడను మంచి క్యారెక్టర్కు సెలెక్ట్ చేశాడు వేణు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ‘కథలోని ఎమోషన్ను అర్థం చేసుకుని నితిన్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. తన కోసం కాకుండా సినిమా కోసం ఆలోచించే హీరో నితిన్. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అలాంటి క్వాలిటీ నితిన్లో చూశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఈ మూవీకి ఆయన టైటిల్ పెట్టుకున్నాం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఇది. కొత్త స్క్రీన్ ప్లేను చూస్తారు’ అని చెప్పాడు. హీరోయిన్స్ సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబి దిత్య, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డీవోపీ కేవీ గుహన్ తదితరులు పాల్గొన్నారు.