- ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక
- గవర్నర్ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
పాట్నా: బిహార్లో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. బుధవారం అసెంబ్లీ సెంట్రల్ హాల్లో కూటమి పార్టీల మీటింగ్ జరిగింది.
ఇందులో నితీశ్ కుమార్ను ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ), హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీల ఎమ్మెల్యేలందరూ నితీశ్కు మద్దతు పలికారు. అనంతరం నితీశ్ కుమార్ కూటమి పార్టీల నేతలతో కలిసి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్తో సమావేశమయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ అందజేశారు.
అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ఎన్డీయే ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లెటర్ను అందించారు. నితీశ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
హాజరుకానున్న మోదీ..
పాట్నాలోని గాంధీ మైదాన్లో గురువారం ఉదయం ఎన్డీయే సర్కార్ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. సీఎంగా నితీశ్ కుమార్తో పాటు మరికొంత మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర కీలక నేతలు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, కూటమిలోని ఏ పార్టీకి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపై చర్చలు ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. హోంశాఖతో పాటు స్పీకర్ పోస్టు కోసం బీజేపీ, జేడీయూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో స్పీకర్గా బీజేపీ నేత నందకిశోర్ ఉండగా, డిప్యూటీ స్పీకర్గా జేడీయూ లీడర్ నారాయణ్ యాదవ్ ఉన్నారు.
