IND vs WI 1st Test: స్టన్నింగ్ క్యాచ్‌తో మైండ్ పోగొట్టిన నితీష్.. షాక్‌లో విండీస్ ఓపెనర్

IND vs WI 1st Test: స్టన్నింగ్ క్యాచ్‌తో మైండ్ పోగొట్టిన నితీష్.. షాక్‌లో విండీస్ ఓపెనర్

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో స్టన్నింగ్ క్యాచ్ ఒకటి నమోదయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ నితీష్ కుమార్ రెడ్డి డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. మూడో రోజు ఆటలో భాగంగా వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 8 ఓవర్ రెండో బంతిని లెగ్ సైడ్ దిశగా వేశాడు. లెగ్ సైడ్ దిశగా ఫ్లిక్ చేసిన విండీస్ ఓపెనర్ చందర్ పాల్.. నితీష్ రెడ్డి పట్టిన అద్భుతంగా క్యాచ్ కు ఔటయ్యాడు.    

స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ ఫుల్ లెంగ్త్ తో డైవ్ చేసి అందుకున్న ఈ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నితీష్ క్యాచ్ కు చందర్ పాల్ షాక్ లో ఉండిపోయాడు. నితీష్ క్యాచ్ తో వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులకే టాగెనరైన్ చంద్రపాల్ ఔటయ్యాడు. ఇదే ఊపును కొనసాగించిన ఇండియా ఆ తర్వాత వెంటనే రెండు వికెట్లను తీసుకుంది. జడేజా తన స్పిన్ మాయాజాలంతో జాన్ కాంప్‌బెల్ (14), బ్రాండన్ కింగ్ (5) ను ఔట్ చేసి వెస్టిండీస్ ను కష్టాల్లో నెట్టాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. ఇంకా 251 పరుగులు వెనకపడి ఉంది.   

రెండో రోజు (శుక్రవారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి మూడో రోజు ఉదయాన్నే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ధ్రువ్‌‌ జురెల్ (210 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్‌‌),  కేఎల్‌‌ రాహుల్ (197 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 100)  సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్‌‌తో తొలి టెస్టును ఇండియా పూర్తిగా తన కంట్రోల్‌‌లోకి తీసుకుంది. 

అంతకుముందు గురువారం టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 44.1 ఓవర్లలో 162  రన్స్‌‌కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్‌‌ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్‌‌ నడ్డి విరిచారు. అనంతరం బ్యాటింగ్‌‌లోనూ దుమ్మురేపిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 286 రన్స్‌‌ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు.. కుల్దీప్ యాదవ్ రెండు.. సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.