
నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అబ్బపూర్ తండాలో 13ఏండ్ల బాలికను గుట్టుచప్పుడు కాకుండా శుక్రవారం అర్ధరాత్రి 42ఏండ్ల వ్యక్తి పెండ్లి చేసుకున్నాడు. స్థానికులు, డీసీపీవో చైతన్య కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బపూర్ తండాకు చెందిన 13సంవత్సరాల బాలికను మండలంలోని ఫకీరాబాద్ మాన్ సింగ్ తండాకు చెందిన సాయబ్ రావ్ శుక్రవారం అర్ధరాత్రి పెండ్లి చేసుకుంటున్నట్లు పోలీసులకు, హెల్ప్ లైన్కు ఫిర్యాదు అందింది.
దీంతో ఏఎస్ఐ మోహన్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ శోభ వెళ్లేసరికి పెండ్లి అయిపోయి అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, పంచాయతీ సెక్రటరీతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ తండాకు వెళ్లింది. బాలిక ఇంటి వద్ద ఎవరూ లేరు. ఈ పెండ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సహకరించినట్లు విచారణలో తేలింది. బాలిక మూడేండ్ల వయసులోనే తల్లి మానసిక వ్యాధితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇతర కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ పెండ్లి చేసినట్లు తెలిసింది. పంచాయతీ సెక్రెటరీ ఎస్ కే అహ్మద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.