పదవి వరించేదెవరినో !.. డీసీసీ ప్రెసిడెంట్, టీపీసీసీ కార్యవర్గ నియామకాలకు సన్నాహాలు

పదవి వరించేదెవరినో !.. డీసీసీ ప్రెసిడెంట్, టీపీసీసీ కార్యవర్గ నియామకాలకు సన్నాహాలు
  • నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లీడర్లలో టెన్షన్ 
  • సొంత జిల్లాపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్ స్పెషల్ ఫోకస్

నిజామాబాద్, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి సన్నాహాలు జరుగుతుండడం, టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే సంకేతాలు కనబడడంతో జిల్లా నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించనుందోనని హాట్ టాపిక్​గా మారింది. మూడేండ్ల పదవీ కాలం పూర్తైన జిల్లాల్లో కొత్త అధ్యక్షులను నియమిస్తామని,  ఈనెల 26, 27 తేదీల్లో ప్రకటించే చాన్స్​ ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​​కుమార్​గౌడ్​ శనివారం నిజామాబాద్​లో ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఏ పదవి వరించనుందోనని కాంగ్రెస్ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. 

ఓసీలతో పాటు బీసీలు..

మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి డీసీసీ పోస్ట్​పై ఆసక్తి చూపుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన గత అసెంబ్లీ  ఎన్నికల సమయంలో కాంగ్రెస్​లో చేరారు. వివాదరహితుడిగా ముద్ర ఉన్న ఆయన మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి అండతో డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్​లో నిజామాబాద్ రూరల్​ టికెట్ ఆశించి భంగపడ్డ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్​ నగేశ్​రెడ్డి సైతం కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి రేస్​లో ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆర్మూర్ సెగ్మెంట్​ నుంచి అసెంబ్లీ ఎలక్షన్​లో పోటీ చేసి ఓటమిపాలైన వినయ్​కుమార్​రెడ్డి, బాల్కొండలో ఓడిపోయిన ముత్యాల సునీల్​రెడ్డి కూడా ఈ పదవి కోసం  ముమ్మరంగా యత్నిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలలో బీసీలకు ప్రయార్టీ ఇవ్వాలని డిమాండ్​ ఉండడంతో జిల్లా నుంచి బీసీ లీడర్లను డీసీసీ పోస్టులో అపాయింట్​ చేయాలనే ఒత్తిడి పెంచారు.  టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సన్నిహితుడి ముద్ర పొందిన శేఖర్​గౌడ్ పదవి దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. 

మరో బీసీ నేత నరాల రత్నాకర్ గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్​అలీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నుడా చైర్మన్​ కేశవేణు కూడా బీసీ కోటాలో డీసీసీ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

స్టేట్ కమిటీలో కొందరికి చోటు..

ఈ నెలాఖరు టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తారని మహేశ్​గౌడ్ ప్రకటించడంతో కొందరు జిల్లా నేతలను స్టేట్ కమిటీలో తీసుకుంటారని స్పష్టమవుతుంది.  మహేశ్​గౌడ్​ సొంత జిల్లా అయినందున డీసీసీ అధ్యక్షుడి నియామకంలో ఆయన కీ రోల్​ పోషించే అవకాశం ఉంది. ఎవరికి ఏ పోస్ట్​ ఇవ్వాలన్నదానిపై క్లారిటీగా ఉండడంతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం.

క్రియాశీలం చేసే పదవిగా గుర్తింపు.. 

పార్టీలో ప్రొటోకాల్ పాటించే డీసీసీ పోస్ట్​తో రాజకీయ మనుగడ సుస్థిరమవుతుందనే అంచనా నేతల్లో ఉండడంతో పోటీదారులు పెరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై ఆందోళనలు తదితర వాటితో బిజీగా ఉండాల్సి వస్తుంది. అదే రూలింగ్ పార్టీకి జిల్లా ప్రెసిడెంట్​గా​ వ్యవహరిస్తే ప్రొటోకాల్ ఎంజాయ్ చేయొచ్చనే భావన లీడర్లలో ఉంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్, అన్వేశ్​రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ ఆయా స్టేట్ కార్పొరేషన్లకు చైర్మన్ పోస్టులు పొందారు. 

మరికొందరు నామినేటెడ్​ పదవులు ఆశిస్తున్నప్పటికీ ఇప్పటికే జిల్లా నుంచి నలుగురు లీడర్లకు చాన్స్​ లభించినందున ఇతరులకు అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తూ.. దానిని డీసీసీతో భర్తీ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. మున్ముందు లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నందున ​డీసీసీ పోస్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరేండ్ల పాటు డీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించిన మానాల మోహన్​రెడ్డి రెండో విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది.