- సీపీ సాయి చైతన్య
బోధన్, వెలుగు : పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని సీఐ ఆఫీస్లో డివిజన్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసుల దర్యాప్తులో పారదర్శకత ఉండాలని, కేసు నమోదు నుంచి చార్జీషీటు వరకు ప్రతి విషయాన్ని పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల విషయంలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలన్నారు. ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలన్నారు. గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 పై గ్రామాల్లో వివరించాలన్నారు. ఆన్లైన్మోసాల బారినపడితే వెంటనే 1930 కాల్ చేయాలని, లేదంటే ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టి బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. హైవే రోడ్డులను కలిపే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించాలన్నారు.
రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు ఉంటే నేషనల్, స్టేట్ హైవే అథారిటీ, ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి రోజు డ్రంక్అండ్ డ్రైవ్ నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా నిఘా పెంచాలన్నారు.
గంజాయి , ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. సమావేశంలో ఏసీపీ పి.శ్రీనివాస్, బోధన్, రుద్రూర్ సీఐలు వెంకటనారాయణ, కృష్ణ, ఎస్సైలు మచ్ఛేందర్ రెడ్డి, రమ, చంద్రమోహన్, సునీల్, సాయన్న, ఏఎస్సై రామరాజు, సీసీఆర్బీ సీఐ రమేశ్తదితరులు పాల్గొన్నారు.
