వడ్ల కొనుగోళ్లలో రికార్డు.. 8.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలోనే ఇందూరు టాప్

వడ్ల కొనుగోళ్లలో రికార్డు.. 8.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలోనే ఇందూరు టాప్
  • రైతులకు రూ.1,885 కోట్ల చెల్లింపులు
  • రూ.375 కోట్ల బోనస్​ ఇచ్చేందుకు ఏర్పాట్లు 
  • కొనుగోలు సెంటర్లకు రూ.36 కోట్ల కమీషన్
  • 231 సెంటర్లు నడిపిన మహిళా సంఘాలకు రూ.5 కోట్లు ​

నిజామాబాద్, వెలుగు :ఇందూర్ జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోళ్లు క్లోజ్ అయ్యాయి. రికార్డుస్థాయిలో 8.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. సన్న వడ్లు 7.30 లక్షల టన్నులు కాగా, దొడ్డు వడ్లు 96,881 టన్నులు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం టార్గెట్ 7 లక్షల మెట్రిక్​ టన్నులు కాగా,  మరో 1.26 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించారు.  సన్నాలకు రూ.500 బోనస్​ ప్రకటించడంతో సర్కార్ కేంద్రాల్లోనే అమ్మారు. 

రైస్ మిల్లర్ల ప్రైవేట్ కాంటాల వైపు వెళ్లలేదు. ప్రతి సీజన్​లో గరిష్ఠంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు దాటని ప్రభుత్వ కొనుగోళ్లు ఈసారి రికార్డ్​నమోదు చేసింది. దొడ్డు వడ్లు సుమారు 3.59 లక్షల టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసినా స్టేట్​లో జిల్లా టాప్ లో నిలువడం గమనార్హం.    

రూ. వందల కోట్లు టర్నోవర్

యాసంగి లో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 11.85 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి అంచనాతో మొదట 600 ప్రభుత్వ సెంటర్లు ఏర్పాటు చేశారు. డిమాండ్ దృష్ట్యా ఏప్రిల్ 27  తర్వాత మరో 102 సెంటర్లను పెంచారు. ప్రభుత్వ కొనుగోళ్లు షురూ కాకముందు దొడ్డు వడ్లను క్వింటాల్​కు రూ.2,200 చొప్పున మిల్లర్లకు 
విక్రయించారు. 

చెల్లింపులు ఇలా..

జిల్లాలో 1,09,177మంది  రైతుల నుంచి 96,881 టన్నుల దొడ్డు వడ్లు, 7.30 లక్షల టన్నుల సన్న వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇందుకుగాను రూ.1,885 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.  మరో  రూ.30 కోట్లు రెండు రోజుల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు.  

మహిళలకు రూ.5 కోట్ల ఆదాయం

వడ్ల కొనుగోళ్లకు మొత్తం 702 సెంటర్లు నడుపగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అందులో 231 సెంటర్లను ఐకేపీ మహిళా సంఘాలకు అప్పగించారు.  1.60 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం  కొనుగోళ్లు జరగగా, వారికి రూ.5 కోట్లు కమీషన్ అందనుంది. ప్రతి క్వింటాల్ కు రూ.32 కమీషన్​గా ప్రభుత్వం చెల్లిస్తుంది. సింగిల్ విండోలు నడిపిన 441, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 21, మెప్మా 9  కలిపి 6.66 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. 

వాటింన్నిటికీ సుమారు రూ.31 కోట్లు కమీషన్ సమకూరింది. రూ.500 బోనస్​కు సంబంధించి రూ.375 కోట్ల నివేదికను సివిల్ సప్లయ్ ఆఫీసర్లు సర్కార్​కు పంపారు. సీజన్​ వడ్లతో జిల్లాలో ఆరు నెలల రేషన్​ సరఫరాతో పాటు మేడ్చల్​, రంగారెడ్డి, అదిలాబాద్​, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల అవసరాలు తీరనున్నాయి. 

వడ్లు మిగిలి ఉంటే..

సీజన్​ దాదాపు ముగిసినట్లే. ఇంకా ఎక్కడైనా వడ్లు మిగిలి ఉంటే వారి కోసం డొంకేశ్వర్, ఉమ్మెడ, గాదెపల్లిలో గ్రామాల్లో ఎనిమిది కొనుగోలు సెంటర్లు ఓపెన్ పెట్టారు. వారం తర్వాత వాటిని కూడా మూసేయనున్నారు. 

అంచనాకు మించి కొనుగోళ్లు..

2020 కొవిడ్ లాక్​డౌన్ లో మిల్లర్లు ప్రైవేట్ కాంటాలు పెట్టలేదు. అప్పుడు జిల్లాలో 7.20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు  విక్రయించాం. ఈ యాసంగిలో అంచనాకు మించి 8.26 లక్షల టన్నుల వడ్లు సేకరించి స్టేట్​లోనే జిల్లా మొదటి స్థానం పొందింది. రూ.36 కోట్ల వడ్ల కమీషన్ చెల్లింపులు, బోనస్ త్వరలో అందజేస్తాం.- శ్రీకాంత్​రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం​​