
- స్పెషల్ ఆఫీసర్లు, మహిళా సంఘాలకు బాధ్యత
- ఈత వనాలకు 66 వేల మొక్కలు
- ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మరో 14 లక్షల ప్లాంట్స్
నిజామాబాద్, వెలుగు : వానాకాలం ప్రారంభం కావడంతో వనమహోత్సవానికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. 29 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీ గ్రౌండ్స్, హాస్టళ్లలోని ఖాళీ స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మహిళా సంఘాల సహకారంతో ఇంటింటికీ ఐదు పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను భాగస్వాములను చేయనున్నారు. గీత కార్మికుల ప్రయోజనం కోసం 66 వేల ఈత మొక్కలు నాటేందుకు ప్లాన్ చేయగా, ఫారెస్ట్ శాఖతో విడిగా 14 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
లక్ష్యం 29 లక్షల మొక్కలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ రియాల్టీని గమనించకుండా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఉన్న మొక్కలను తీసేసి కొత్తవి నాటారు. దీంతో రూ.లక్షల్లో డబ్బు వృథా అయింది. అలా కాకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు సూచించింది. గత ఏడాది 41.50 లక్షల మొక్కలు నాటగా, ఈసారి టార్గెట్ తగ్గించి 29 లక్షల మొక్కలు నాటాలని జిల్లాయంత్రాంగం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 15 కొత్త గ్రామ పంచాయతీలతో కలిపి మొత్తం 545 జీపీలలో నర్సరీల పెంపకం బాధ్యతను పంచాయతీ సెక్రటరీలు, ప్రత్యేకాధికారులకు అప్పగించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.
మహిళా సంఘాలకు బాధ్యత..
కాంగ్రెస్ సర్కార్ మహిళా సంఘాలకు వివిధ బాధ్యతలు అప్పగిస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, స్కూల్స్ రిపేర్లు కమిటీలే చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకోలేని పేదలకుమహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. వనమహోత్సవంలోనూ మహిళా సంఘాలు ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఆవరణలో నిమ్మ, జామ, దానిమ్మ, సపోట, పొప్పడి పండు (బొప్పాయి) మొక్కలు నాటనున్నారు.
జిల్లాలోని 2.76 ఇండ్ల పెరట్లో మొక్కలు నాటించి మానిటరింగ్ చేసే బాధ్యతను మహిళలకే ఇచ్చారు. ఈత వనాల కోసం 66 వేల మొక్కలు రెడీ చేస్తుండగా, 1,69,343 లక్షల హెక్టార్లున్న ఫారెస్ట్ ల్యాండ్లో విడిగా 14 లక్షల మొక్కలు నాటేందుకు ప్లాన్ రెడీ అయింది. ఇందులో సగం పండ్ల మొక్కలు కాగా, మిగతావి టేకు మొక్కలు ఉన్నాయి.
ప్రతి పంచాయతీలో నర్సరీ..
వర్షాలు మొదలైనందున వనమహోత్సవానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు సిద్ధం చేస్తున్నాం. ఖాళీ స్థలాలు, ఇందిరమ్మ ఇండ్ల ఎదుట మొక్కలు నాటి, ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మహిళలకు అప్పగిస్తున్నాం. సాయాగౌడ్, డీఆర్డీవో