ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

హరితహారం మొక్కలను బాధ్యతతో పెంచాలి

బోధన్​, వెలుగు: హరితహారంలో రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా  పెంచాలని కలెక్టర్​ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం బోధన్​పట్టణ శివారులోని నిజామాబాద్–​-బోధన్​ రోడ్డు కు ఇరువైపుల నాటిన మొక్కలను కలెక్టర్  పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. బోధన్​టౌన్​లోని రోడ్డు డివైడర్​పై నాటిన కోనోకార్ఫస్​ మొక్కలతో ఇబ్బందులు వస్తాయని ప్రజలు  ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్​ తెలిపారు.  ఆ మొక్కలు  భారీగా పెరగకుండా కట్​చేయిస్తామని, మళ్లీ అలాంటి మొక్కలు నాటించబోమని తెలిపారు.  అనంతరం బోధన్​ మండలంలోని మినార్​పల్లి గ్రామాన్ని కలెక్టర్​విజిట్​చేసి  హరితహారం మొక్కలను పరిశీలించారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో రాజేశ్వర్​, మున్సిపల్​ చైర్​ పర్సన్​ తూము పద్మావతి, మున్సిపల్​ కమిషనర్​ రామలింగం, ఎంపీడీవో మధుకర్​, డిప్యూటీ డీఈ శివానందం, కౌన్సిలర్లు ఉన్నారు .   

ప్రజాఉద్యమాలను అరెస్టులతో అణచలేరు..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య

నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అరెస్టులతో అణిచివేసేందుకు కుట్ర చేస్తోందని, కానీ అది అసాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య హెచ్చరించారు. ప్రధాని మోడీ బర్త్​డే వారోత్సవాల్లో భాగంగా  మంగళవారం బీజేపీ లీడర్లు నగరంలోని రఘునాథ చెరువు వద్ద ‘జలమే జీవనం’ కార్యక్రమాన్ని చేపట్టారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్యక్రమం నిర్వహించేందుకు పర్మిషన్​లేదని లీడర్లు శివకుమార్, వీరేందర్ , శ్రీనివాస్ తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్​ చేసి 5వ టౌన్​పోలీస్​స్టేషన్​కు తరలించారు. వెంటనే స్పందించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య జిల్లా నాయకులతో కలిసి పీఎస్​ఎదుట ధర్నా చేపట్టారు. బీజేపీ లీడర్ల అరెస్ట్​ అప్రజాస్వామికమని  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య  మాట్లాడుతూ  సీఎం కేసీఆర్​ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 

విపక్షాల గొంతు నొక్కుతున్నరు : ధన్​పాల్ సూర్యనారాయణ

టీఆర్ఎస్​ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని ఇది ఎంతో కాలం నిలవదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్​పాల్​ సూర్య నారాయణ అన్నారు. బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్​చేయడాన్ని ఆయన  ఖండించారు. సేవా కార్యక్రమాలకు కూడా పోలీసుల పర్మిషన్​తీసుకోవాలా? అని ప్రశ్నించారు.  చెరువుల్లో  చెత్తను తొలగించడం వల్ల  ప్రభుత్వానికి, పోలీసులకు నష్టమేమిటో చెప్పాలన్నారు. నియంత పాలకున్ని సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.

వడ్లను శుభ్రం చేసి తీసుకొచ్చేలా చూడాలి

కామారెడ్డి , వెలుగు:   రైతులు వడ్లను  శుభ్రం చేసి  కొనుగోలు కేంద్రాలకు  తీసుకొచ్చే విధంగా ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు చూడాలని కామారెడ్డి కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో జరిగిన మీటింగ్​లో కలెక్టర్​మాట్లాడుతూ.. కేంద్రాల్లో సరిపోను టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు.  కోత మిషన్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలన్నారు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్​తెలిపారు. అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​, సివిల్​సప్లై మేనేజర్​జితేంద్రప్రసాద్, డీఎస్​వో రాజశేఖర్, ఆర్టీవో వాణి, డీఏవో భాగ్యలక్ష్మీ,  మార్కెటింగ్​ ఆఫీసర్​ రమ్య పాల్గొన్నారు. అనంతరం  పంట కోత ప్రయోగంపై కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   

అక్రమాలను ఆపకుంటే ఆమరణ దీక్ష
బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి , వెలుగు: నియోజకవర్గంలో పలు అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా కంప్లైంట్​చేస్తే కలెక్టర్ ​ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ  నియోజకవర్గ  ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం  కామారెడ్డిలోని పార్టీ ఆఫీస్​లో వెంకటరమణారెడ్డి ప్రెస్​మీట్​లో మాట్లాడారు. నియోజకవర్గంలో భూములకు సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నా కలెక్టర్ ​కట్టడి చేయకపోవడం సరికాదన్నారు. కామారెడ్డి, అడ్లూర్​  మధ్య  అసైన్డ్​ ల్యాండ్స్ ​కబ్జాకు గురయ్యాయన్నారు. పట్టణంలో సర్వే నంబర్​ 6 ఆబాదీ అని తహసీల్దార్​నిర్ధారించినప్పటికీ మున్సిపల్​ఆఫీసర్లు ఎందుకు ఆ స్థలం స్వాధీనం చేసుకుంటలేరన్నారు. టీఆర్ఎస్​లీడర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్లు సదరు భూమి ప్రభుత్వానిదా?  కాదా..? తేల్చాలని తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారన్నారు. ధరణి పోర్టల్​లో తప్పులను సరిదిద్దమని పేద రైతులు కలెక్టరేట్ ​చుట్టూ తిరుగుతున్నా.. స్పందించటం లేదన్నారు. పెద్ద వాళ్లకు సంబంధించిన భూములను కలెక్టర్​కు తెలియకుండానే మారుస్తున్నారన్నారని ఆరోపించారు.

ఓ కాంట్రాక్ట్​ఎంప్లాయ్​వద్ద కలెక్టర్​డిజిటల్​కీ ఉందని, అతడు మార్పులు మార్పులు చేస్తున్నాడన్నారు. ధరణిలో మార్పులు చేసుకున్న చాలా మంది నుంచి సదరు వ్యక్తి తన సొంత ఊరిలో నిర్మించే గుడికి చందాలు వసూలు చేసినట్లు ఆరోపించారు.  కామారెడ్డి టౌన్​ను చూస్తే  చికాగో టౌన్ లా కనిపిస్తుందని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందని వెంకటరమణారెడ్డి అన్నారు.  అభివృద్ధి అంటే  డివైడర్లు, సెంట్రల్​ లైటింగ్​సిస్టం కాదని, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నారు. అక్రమాలపై చర్యలు  తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ  బుధవారం నుంచి  3 రోజుల పాటు నిరసన కార్యక్రమం  చేపడుతామని, అయినా స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వెంకటరమణారెడ్డి  హెచ్చరించారు.  మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ శ్రీకాంత్​, టౌన్​ ప్రెసిడెంట్​విఫుల్​ తదితరులు పాల్గొన్నారు. 


వీఆర్ఏలకు బీజేపీ లీడర్ల మద్దతు

భిక్కనూరు, వెలుగు:  వీఆర్ఏల  సమ్మెకు మంగళవారం బీజేపీ లీడర్లు మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్​రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా వీఆర్​ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​చేశారు. వీఆర్ఏలు గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు భరించలేక గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. పట్టణాధ్యక్షుడు గెరిగంటి రమేశ్​, బస్వారెడ్డి, మల్లారెడ్డి, ధర్మారెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి, రాజశేఖర్​రెడ్డి  పాల్గొన్నారు. 


చెరువులో వ్యర్థాలు తొలగించిన దళిత మోర్చా లీడర్లు

ఆర్మూర్, వెలుగు : ప్రధాని మోడీ బర్త్​డే  సందర్భంగా బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ టౌన్​లోని గుండ్ల చెరువులోని వ్యర్ధాలను తొలగించారు. ‘జలమే జీవనం –-- స్వచ్ఛతే ఆరోగ్యం’ అనే సంకల్పంతో కార్యక్రమం నిర్వహించామని బీజేపీ దళిత మోర్చా టౌన్ ప్రెసిడెంట్​ పులి యుగంధర్ అన్నారు.  బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​అనిల్ కుమార్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీధర్​, గటడి శివ తదితరులు పాల్గొన్నారు.

అబార్షన్లపై అవగాహన కల్పించండి

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి) వెలుగు : లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని, ఆడపిల్ల పుడుతుందని తెలిసి కొందరు మహిళలు అబార్షన్లు చేయించుకుంటున్నారని, అటువంటి సంఘటనలను అడ్డుకునేందుకు పీఎంపీ, ఆర్ఎంపీలు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా చైల్డ్​వెల్ఫేర్​ఆఫీసర్​స్వామి, నిజాంసాగర్ పీహెచ్​సీ డాక్టర్ రాధాకృష్ణ కోరారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని పీహెచ్​సీ ఆవరణలో మండల పీఎంపీ, ఆర్ఎంపీ, ఏఎన్​ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పిల్లలు లేని తల్లిదండ్రులు చట్ట పరంగా అనాధ పిల్లలను దత్తత తీసుకొనే విషయం,అవసరమైన డాక్యుమెంట్స్​పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్స్​అసోసియేషన్​ప్రెసిడెంట్​ విజయ్, సంబంధిత  ఆఫీసర్లు పాల్గొన్నారు.

అక్బర్ నగర్ లో చిరుత కలకలం

వర్ని, వెలుగు: నిజామాబాద్ ​జిల్లా రుద్రూర్‌‌ మండలం అక్బర్‌‌నగర్‌ ఫారెస్ట్​లో చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో  ఆ ప్రాంతంలో ఉన్న అగ్రికల్చర్ ​యూనివర్సిటీ స్టూడెంట్లు భయంతో వణికిపోతున్నారు. 5 రోజులుగా గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని అక్బర్‌‌నగర్‌‌కు చెందిన గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు చెప్పారు. వెంటనే స్పందించిన వర్ని ఫారెస్ట్ డిఫ్యూటీ  రేంజ్ ఆఫీసర్ కె. బాబు మంగళవారం చిరుత సంచరించిన ప్రదేశాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిరుత మనుషులకు ఎలాంటి హాని చేయదని, దాడి చేస్తేనే తిరగబడుతుందని, అందరూ అలర్ట్​గా ఉండాలని చెప్పారు. చిరుతను బంధించడానికి ఫారెస్ట్​లో బోను పెట్టామని  ఆఫీసర్​బాబు తెలిపారు.