వారణాసిలో తెలంగాణ రైతులు : నేడు నామినేషన్లు

వారణాసిలో తెలంగాణ రైతులు : నేడు నామినేషన్లు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాశికి చేరుకున్నారు తెలంగాణ రాష్ట్ర రైతులు. ఇవాళ వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు చేయనున్నారు రైతులు. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుంచి పదుల సంఖ్యలో రైతులు.. వారణాసి వెళ్లారు. గడిచిన ఐదేళ్ల కాలంలో.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేయాలని నిర్ణయించారు.

వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. నిన్న శుక్రవారం వారణాసిలో నామినేషన్ వేశారు మోడీ. నిజామాబాద్ రైతుల సంక్షేమం కోసం TRS లోక్ సభలో పోరాడినా కూడా కేంద్రం స్పందించలేదనీ.. అందుకో మోడీపై పోటీచేయాలని నిర్ణయించినట్టు నిజామాబాద్ రైతులు ఇటీవల ఓ ప్రెస్ నోట్ లో వివరించారు. తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా తమ సమస్యలు పరిష్కరించలేదంటూ ఇవాళ నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు.

ఐతే… మోడీపై నామినేషన్లు వేయడానికి వెళ్లింది నిజామాబాద్ పసుపు రైతులు కాదని.. వాళ్లంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే అని రైతు సంఘాలు, బీజేపీ నేతలు విమర్శించారు.

నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీ కవితపై రైతులు రికార్డ్ సంఖ్యలో నామినేషన్లు వేసి పోటీ చేశారు. ఇది దేశమంతటా హాట్ టాపిక్ అయింది. రైతులను బీజేపీ ప్రోత్సహించి నామినేషన్లు వేయించినట్టుగా టీఆర్ఎస్ భావించిందని.. అందుకే.. మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా KCR ఇలా ప్లాన్ చేశారని కొందరు అనుకుంటున్నారు.