
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఏటీఎం డబ్బుల చోరీ ఘటనలో రూ. 5 లక్షలు కాలిబూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని త్రీటౌన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో గల ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు దుండగులు చోరీకి యత్నించారు. ఈ సమయంలో ఏటీఎంను ఓపెన్ చేసేందుకు గ్యాస్ కట్టర్ను వాడడంతో క్యాష్ బాక్స్లోని రూ.5 లక్షల విలువైన నోట్లు కాలిబూడిదైనట్లు ఆఫీసర్లు గుర్తించారు.
ఘటన జరిగిన టైంలో క్యాష్ బాక్స్లో రూ.24 లక్షలు ఉన్నట్లు తెలిపారు. చోరీ చేస్తున్న టైంలో అటువైపు పెట్రోలింగ్ పోలీసులు రావడంతో వారిని చూసి దుండగులు పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు పాల్దా గ్రామం వద్ద వ్యాన్, గ్యాస్ కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు మహారాష్ట్రలోని లాతూర్లో వ్యాన్ను దొంగిలించి, అదే వ్యాన్లో నిజామాబాద్కు వచ్చి చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
వ్యాన్ ఓనర్ను పిలిపించి విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలో ఓ ఏటీఎంలో చోరీకి యత్నించినా.. అది సాధ్యం కాకపోవడంతో నిజామాబాద్ వచ్చినట్లు తేలింది. గత రెండు వారాల్లో బాల్కొండ, మెండోరాలో జరిగిన ఏటీఎం దొంగతనాల్లోనూ వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.