మెదక్, వెలుగు: మెదక్ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో విద్య, వైద్యంపై వాడివేడి చర్చ జరిగింది. చైర్ పర్సన్ ర్యాకల హేమలత అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ సమస్యలున్నప్పటికీ సలహా కమిటీ మీటింగులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ‘మన ఊరు మన బడి’ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని డీఈవోను ఎమ్మెల్సీ నిలదీశారు. జెడ్పీ మీటింగ్కు కలెక్టర్ రాకపోవడాన్ని నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు విజయ్ కుమార్తప్పుపట్టారు. కలెక్టర్ రాలేనప్పుడు మీటింగులు పెట్టి ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ చీఫ్ సెక్రటరీ మీటింగ్లో ఉండడం వల్లే రాలేకపోయారని జడ్పీ సీఈవో వెంకట శైలేష్ చెప్పారు.
స్కానింగ్, టెస్టులు బయిటికి రాస్తున్రు..
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, గడిచిన మూడేళ్లలో ఆసుపత్రి సలహా కమిటీ మీటింగ్ ఒక్కసారి కూడా ఎందుకు పెట్టలేదని నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్ ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా మీటింగ్ పెట్టలేకపోయామని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్పారు. కమిటీ లేకున్నాజెడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేలతో చర్చించి అవసరమైన పనులు చేస్తున్నామన్నారు. హాస్పిటల్లో ఎన్ని డాక్టర్ పోస్టులున్నాయి? అందులో రెగ్యులర్ డాక్టర్లు ఎందరు? కాంట్రాక్ట్డాక్టర్లు ఎందరు? ఎందరు డ్యూటీకి వస్తున్నారని అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్నినిధులు వచ్చాయో, వాటిని ఎందుకు వినియోగించారో ఎందుకు చెప్పడం లేదన్నారు. స్కానింగ్, టెస్ట్ లకు బయటకు రాయడం వల్ల పేదలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. రెగ్యులర్ రేడియాలజిస్ట్లు లేక పోవడం వల్ల స్కానింగ్లకు ఇబ్బంది ఉందని డీసీహెచ్ చెప్పారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్ హాస్పిటల్లలో రేడియాలజిస్టుల నియమాకం కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్కు లేఖ రాశామని చెప్పారు. ఎంపీపీలంతా పీహెచ్సీ ఆసుపత్రి సలహా కమిటీ చైర్పర్సన్లు అయినప్పటికీ వైద్యారోగ్యశాఖ లెక్కచేస్తలేదని, ఏ మీటింగ్ పెట్టినా పిలవడం లేదని నార్సింగి ఎంపీపీ సబిత ఫైర్ అయ్యారు. నార్సింగి పీహెచ్సీలో రెండేళ్లుగా నార్మల్ డెలివరీలు కావడంలేదని, డాక్టర్ వెళ్లిపోయి నెలరోజులైనా తమకు సమాచారం లేదన్నారు. చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ ఎంపీపీలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీపీల ఆధ్వర్యంలో ఒక్క మీటింగ్ అయినా పెట్టారా అని డీఎంహెచ్ఓను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రశ్నించారు. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలని డాక్టర్లకు ఆదేశాలిస్తామని డీఎంహెచ్ఓ హామీ ఇచ్చారు.
అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్రు
మహిళా సంఘాల పైసలు పక్కదారి పడ్తోంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్ ప్రశ్నించారు. నిజాంపేట మండలంలోని మూడు గ్రామాల్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, శివ్వంపేట మండలం గోమారంలో రూ.2.20 లక్షలను రికవరీ చేయకపోగా, గ్రామం మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎంత వరకు సమంజసమని చంద్రాగౌడ్ ప్రశ్నించారు. దీనిపై డీఆర్డీఓ శ్రీనివాస్ స్పందిస్తూ నందిగామ స్కాంలో సీసీని సస్పెండ్ చేశామని, వీవోఏను తొలగించడంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గోమారంలో కొంత మొత్తం రికవరీ చేయడంతోపాటు, వీవో లీడర్, సీసీలపై చర్యలు తీసుకున్నామన్నారు. రైతుబీమాకు సంబంధించి 121 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, ఇంటి పేరు, పేరు, వయసు, ఆధార్ నెంబర్ తప్పులు సరిచేసి బాధితకుటుంబాలకు త్వరగా బీమా పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రమేశ్
పాల్గొన్నారు.
జిల్లాలో మన ఊరు మన బడి పథకం పనులు చాలా డిలే అవుతున్నాయని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై సమీపించిందని, పనులు ఇంకెప్పుడు చేస్తారని డీఈవో రమేశ్ను ప్రశ్నించారు. కొల్చారం మండలంలో 16 స్కూల్ లను సెలెక్ట్ చేయగా ఇంత వరకు ఒక్క పని స్టార్ట్ కాలేదని జడ్పీటీసీ మేఘమాల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డీఈఓ రమేష్ స్పందిస్తూ మెదక్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో పనులు డిలే అవుతున్నమాట వాస్తవమేనని, వేరే ఏజెన్సీలతో పనులు చేయిస్తామన్నారు.