
‘ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ’అనే పాట రాశానని, తెలంగాణ బరాబర్ కేసీఆర్ పాలే అయ్యిందని, మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నానని ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేండ్లవుతున్నా.. తెలంగాణకు కేసీఆర్ తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదన్నారు. రాష్ట్రంలో ఆల్టర్నేట్ వస్తుందని కలలు కన్నానని, కానీ రాలేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి సోమన్నకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ, ఇక నుంచి కేసీఆర్ దారిలో నడుస్తానని, మళ్లీ గజ్జె కట్టి కేసీఆర్ గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి పాట పాడుతానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఎంతో ఉందని, పార్టీ, జెండా అనేది ముఖ్యం కాదని, ప్రజల ఎజెండానే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో తాను అడుగు పెట్టక పదేండ్లు అయ్యిందని, రాష్ట్రం ఏర్పడే వేళ ఈ భవన్కు దూరమయ్యానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన ఇంటికి తాను వచ్చినట్టు అనిపిస్తుందని పేర్కొన్నారు.
తాను మాట్లాడితే, పాట పాడితే కొందరికి ఎంటర్టైన్మెంట్ అయ్యిందని, కేసీఆర్ పాట రోడ్ల మీద కాదు చట్టసభల్లోకి రావాలని చూశారన్నారు. 25 ఏండ్లు కష్టపడితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానని, తాను గతంలో పనిచేసిన పార్టీలు అట్టర్ ప్లాప్ అయ్యాయని, బీఆర్ఎస్ కోసం కష్టపడి పని చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేటీఆర్ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసమే సోమన్న బీఆర్ఎస్లోకి వస్తున్నారని చెప్పారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవి గాయకులను శాసన మండలిలో బీఆర్ఎస్ కూర్చోబెట్టిందని గుర్తు చేశారు.