తెలంగాణ ప్రయోజనాన్ని అమ్మేసే ఆలోచన వద్దు: ఎంపీ అర్వింద్

తెలంగాణ ప్రయోజనాన్ని అమ్మేసే ఆలోచన వద్దు: ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలో ఉన్న కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి కూర్చొని మాట్లాడితే, ఆలమట్టి ప్రాజెక్టు సమస్య కొలిక్కివస్తుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ ధర్మపురి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్​ కలెక్టరేట్, బీజేపీ జిల్లా ఆఫీస్‎లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎలక్షన్​టైంలో కర్నాటక నుంచి లారీల కొద్దీ డబ్బులు తెలంగాణకు పంపారని, దీనిపై కేసు కూడా నమోదైందన్నారు. 

ఇప్పుడందుకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రయోజనాలు అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ సర్కార్​ హయాంలో పెట్రోల్, డీజిల్​ రేట్లు దేశంలోనే అధికంగా ఉండేవని, కేసీఆర్, కేటీఆర్​ లూటీ చేశారని దుయ్యబట్టారు. ఇంధనం రేట్లు తగ్గించమని కేటీఆర్​ ఇప్పుడు కోరడంలో అర్థం లేదన్నారు. బీజేపీ రాష్ట్రాల కంటే కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఉన్న తెలంగాణలో పెట్రోల్, డీజిల్​ రేట్​ రూ.10 ఎక్కువగా ఉందన్నారు. 

జీఎస్టీ తగ్గించడంతో ఖర్చు తగ్గి దేశప్రజలు సంతోషిస్తుండగా, ఆదాయం తగ్గిందని తెలంగాణ కాంగ్రెస్​ నేతలు ఏడ్వడం వింతగా ఉందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కేంద్ర సర్కార్​ రూ.2 లక్షల కోట్ల ఇన్​కమ్​ కోల్పోతుందన్నారు. ప్రజల సంతోషం కోసం ప్రధాని మోదీ జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆమ్​ఆద్మీ ట్యాక్స్‎తో ప్రధాని మోదీ జన్ కళ్యాణ్​ చేశారని, 144 వందేభారత్​ రైళ్లు, డిఫెన్స్, రైల్వే డెవలప్​మెంట్, 80 కోట్ల మంది పేదలకు ఆహార భద్రత బియ్యం, ఐఐటీ, ఐఐఎం కాలేజీలు తెచ్చారన్నారు.

 జీఎస్టీ తగ్గించినా జీడీపీ 0.8 శాతం నుంచి ఒక శాతం పెరుగనుందన్నారు. లోకల్​ బాడీ ఎలక్షన్స్​ కోసం తాము ఎదురుచూస్తున్నామని నిజామాబాద్​ జిల్లా అంతా స్వీప్​ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డి, బీజేపీ స్టేట్​ సెక్రటరీ స్రవంతిరెడ్డి ఉన్నారు.