కోమటిరెడ్డి నష్టం జరిగేలా ఏం మాట్లాడలె : జగ్గారెడ్డి

కోమటిరెడ్డి  నష్టం జరిగేలా ఏం మాట్లాడలె : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వాటర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మానిక్ రావు ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నష్టం జరిగేలా ఏం మాట్లాడలేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడింది ఒకటైతే.. మీడియాలో మరొకటి వచ్చిందని, ప్రజలకు ఇంకోలా అర్థం అయిందని అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదని స్పష్టం చేశారు. ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆయన.. రాజకీయ అంశాలపై  చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేశామన్నారు. 

ఠాక్రేతో భేటీలో పార్టీ అంతర్గత విషయాలేవీ చర్చకు రాలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణలో 70 సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించానన్న ఆయన... చాలా మంది సీనియర్ లు పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చారని, తన రూట్ మ్యాప్ ను కూడా త్వరలోనే  ప్రకటిస్తానని స్పష్టం చేశారు.