హైదరాబాద్ : లాక్ డౌన్ క్రమంలో జీతాలు సరిగ్గా రాని కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని దీంతో మార్చి, ఏప్రిల్, మే ఇంటి కిరాయిలు అడగవద్దని ఇంటి యజమానులను ఆదేశించారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం.. ఇంటి యజమానులు అద్దె గురించి ఇబ్బంది పెడితే 100కి ఫోన్ చేయాలన్నారు. మూడు నెలల తర్వాత వడ్డీ తీసుకోకుండా వాయిదా రూపంలో అద్దె తీసుకోవాలని ఇంటి యజమానులకు తెలిపారు. కాదని ఎవరైనా ఇంటి కిరాయి అడిగితే 100 కాల్ చేయాలన్న సీఎం.. ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అన్నారు.
మే 7 వరకు ఎవ్వరూ బయటికి రావద్దని .. దయచేసి ఇంటిలోనే ఉండాలని చెప్పారు. అలాగే 2020-21 విద్యా సంవత్సరంలో విద్యా సంస్థలు ఫీజుల పెంపు చేయవద్దన్నారు సీఎం. ప్రైవేట్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదని.. నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు క్యాన్సిల్ చేస్తామన్నారు. ట్యూషన్ ఫీజు కాకుండా ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని తెలిపారు సీఎం కేసీఆర్.