మాదాపూర్, వెలుగు: భారీ భవనాలను అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా నిర్మిస్తున్నారు తప్పితే ఫైర్ సేఫ్టీపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదాపూర్లో శుక్రవారం ఎఫ్ఎస్ఏఐ ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్ఈఎస్ఏ-2025 నేషనల్ సెమినార్ను ఆయన ప్రారంభించారు. గత పదేండ్లలో హైదరాబాద్వేగంగా డెవలప్మెంట్అవుతుందని, ఎత్తైన భవనాలు నిర్మితమవుతున్నాయన్నారు.
ఎత్తైన భవనాల్లో స్మోక్ మేనేజ్మెంట్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలకు నాణ్యతలేని ఎలక్ట్రికల్ వైర్లే ముఖ్య కారణమన్నారు. త్వరలో ఫైర్ స్టేషన్ల సంఖ్య పెంచి, అధునాతన ఎక్విప్మెంట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఏఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మనోజ్ వాహి, నేషనల్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాల స్టాళ్లూ ఏర్పాటు చేశారు.

