ప్రైవేట్ లెక్చరర్లకు ఏడాదిగా జీతాల్లేవ్
నెలకు రూ.10 వేలు ఇయ్యాలె
గతేడాది మార్చి నుంచి విద్యా వ్యవస్థ ఆగమైతోంది.
ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది.
ప్రైవేట్ లెక్చరర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కాలేజీలు క్లోజైనప్పటి నుంచి ఆపత్కాల భృతి కింద నెలకు రూ. 10 వేలు చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలి.
- రాజన్న యాదవ్, ప్రైవేట్ లెక్చరర్, మంచిర్యాల జిల్లా భీమారం
మంచిర్యాల, వెలుగు: కరోనా ఎఫెక్ట్తో ప్రైవేట్ లెక్చరర్లు అవస్థలు పడుతున్నారు. కాలేజీలు మూతబడటంతో ఏడాదిగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులతో ఆగమైతున్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తున్నారు. కిరాణా షాపులు, కూరగాయల వ్యాపారం, హోటళ్లు పెట్టుకొని బతుకీడుస్తున్నారు. ఆటోడ్రైవర్లుగా, లేబర్గా, ఉపాధి హామీ కూలీలుగా రోజులు నెట్టుకొస్తున్నారు. ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యమిచ్చి ఆదుకుంటున్న సర్కారుకు తమ గోస పట్టట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నా కాలేజీల యాజమాన్యాలు సగం జీతం కూడా ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు చోట్ల (టీఎల్ఎఫ్) నిరసన తెలిపారు.
కరోనాతో కాలేజీలు మూతబడి 2 లక్షల మంది ఆగం
బతుకుదెరువు కోసం కూలీలుగా, డ్రైవర్లుగా మారుతున్నరు ప్రైవేట్ టీచర్లలాగ తమనూ ఆదుకోవాలని లెక్చరర్ల డిమాండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ఉపాధి హామీ కూలీగా మారి ధర్మారం మండలానికి చెందిన ముద్దసాని లింగారెడ్డి ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో 8 ఏండ్లు బాటనీ లెక్చరర్గా పనిచేశాడు. కరోనా వల్ల కాలేజీ మూతపడటంతో మేనేజ్మెంట్ ఏడాదికాలంగా శాలరీ ఇవ్వట్లేదు. దీంతో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీగా మారాడు. కరోనాతో రోడ్డున పడ్డామని, తమ కుటుంబాలను సర్కారు ఆదుకోవాలని కోరుతూ నెలరోజుల కిందట సీఎం కేసీఆర్కు లెటర్ రాశాడు.
కాలేజీల్లో 10 శాతం మందికే జీతాలు
రాష్ర్టవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు వృత్తి విద్యా కాలేజీల్లో కలిపి సుమారు 2 లక్షల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. కరోనా వల్ల నిరుడు మార్చి నెలాఖరు నుంచి కాలేజీలు క్లోజ్ అయ్యాయి. ఈ ఏడాది కాలేజీలు ఓపెన్ చేశాక సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ మూతపడ్డాయి. దీంతో ఆన్లైన్ క్లాసులే నిర్వహించారు. 10 శాతం స్టాఫ్తోనే ఆన్లైన్ క్లాసులను మేనేజ్మెంట్లు నడిపించాయి. వారికి మాత్రమే 50 పర్సెంట్ జీతం చెల్లించాయి. మిగతా 90 శాతం స్టాఫ్కు ఇవ్వలేదు. చాలా కాలేజీలు గతేడాది లాక్డౌన్ టైమ్లోనే సగం మంది లెక్చరర్లను తొలగించాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ ఒకటి నుంచి ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా చాలా కాలేజీలు ఇంకా స్టార్ట్ చేయలేదు. డిగ్రీ, పీజీతో పాటు వృత్తి విద్యా కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నా జీతాలు చెల్లించకపోవడంపై లెక్చరర్లు మండిపడుతున్నారు.
టీచర్లకేనా సాయం
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లకు ఈ ఏప్రిల్ నుంచి నెలకు రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. తమకు ఆ మాత్రం సాయం కూడా అందట్లేదని లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. మేనేజ్మెంట్లు జీతాలు ఇవ్వక, ప్రభుత్వం పట్టించుకోక తమ బతుకులు ఆగమయ్యాయని వాపోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ లెక్చరర్లు పలు చోట్లు నిరసన తెలిపారు. ఆపత్కాల భృతి కింద నిరుడు మార్చి నుంచి ఇప్పటిదాకా నెలకు రూ. 5 వేల చొప్పున అందించాలని కోరారు.
బిర్యానీ సెంటర్ పెట్టుకొని..
పరకాలకు చెందిన చిదిరాల సందీప్ ఎంటెక్ కంప్యూటర్స్, కుమ్రం భీం జిల్లా కౌటాల మండలం గురుడుపేట్కు చెందిన మార్క ఆంజనేయులు ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, బీఈడీ చేశారు. కొన్నేళ్లు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్లుగా పని చేశారు. నిరుడు లాక్డౌన్ తర్వాత కాలేజీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగించింది. గత్యంతరం లేక ఇద్దరూ కలిసి బిర్యానీ సెంటర్ పెట్టుకున్నారు.
ఆటో ట్రాలీ నడుపుతూ..
పెద్దపల్లి జిల్లా ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మద్దునాల మల్లేశం ధర్మారంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా పనిచేశాడు. నెలకు రూ. 25 వేల జీతం వచ్చేది. ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో కరోనా కాలంలో ఇల్లు గడవడం కూడా కష్టమైంది. దీంతో కిరాయికి ఆటో ట్రాలీ నడుపుకుంటున్నాడు. ఇప్పుడు లాక్డౌన్తో కిరాయిలు లేక ఇబ్బంది పడుతున్నాడు.
సగం జీతాలు చెల్లించాలె
గతేడాది నుంచి కాలేజీలు మూతపడ్డాయి. 10 శాతం స్టాఫ్తోనే ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. వారికి సగం జీతాలు చెల్లిస్తూ మిగతా వారిని పక్కనపెట్టారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్న మేనేజ్మెంట్లు లెక్చరర్లకు మొండిచేయి చూపడం బాధాకరం. స్టాఫ్ అందరికీ సగం జీతాలైనా చెల్లించేలా సర్కారు చర్యలు తీసుకోవాలి. - పోకల నాగయ్య, టీఎల్ఎఫ్ స్టేట్ కో ఆర్డినేటర్