- ఆయిల్కంపెనీల నుంచే సప్లై లేదంటున్న డీలర్లు
- ఆఫీసర్లు రివ్యూ చేస్తున్నా కొరత తీరట్లే
- ఆందోళన చెందుతున్న వినియోగదారులు, రైతులు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్బంకుల్లో ఎక్కడచూసినా నోస్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్ కంపెనీల డీలర్లే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆఫీసర్లు పరిస్థితిపై రివ్యూ చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. కంపెనీల నుంచే పెట్రోల్, డీజిల్సప్లై కావడం లేదని, ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ తమను బదనాం చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. కోటా ప్రకారం రావాల్సిన డీజిల్, పెట్రోల్మూడు రోజులకోసారి సప్లై చేస్తున్నారని, వచ్చిన కోటా వచ్చినట్టే అయిపోతుందని డీలర్లు అంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత కొరత ఏర్పడుతుందన్న ప్రచారం నేపథ్యంలో వచ్చిన స్టాక్ రెండు, మూడు గంటల్లోనే అయిపోతోందని చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు కొన్ని కంపెనీల బంకులకే పరిమితమైన ఆయిల్కొరత ఇప్పుడు అన్ని కంపెనీలకు పాకింది. హెచ్పీ, భారత్పెట్రోలియం, ఇండియన్ఆయిల్ బంకులు సైతం పెట్రోల్, డీజిల్ లేక వెలవెలబోతున్నాయి.
తగ్గిన సప్లై..
నల్గొండ జిల్లాలో 214 బంక్ లు ఉండగా, రోజుకు పెట్రోల్ మూడు లక్షల లీటర్లు, డీజిల్ 8 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం పెట్రోల్ఐదు లక్షల లీటర్లు, డీజిల్ పది లక్షల లీటర్లకు చేరాయి. బీపీసీఎల్ కంపెనీ వద్ద మిషనరీ రిపేరు ఉండటంతో హెచ్పీసీఎస్రిఫైనరీ నుంచి ఆయిల్ సప్లై కావాల్సి ఉండగా.. అలా కావడం లేదని సేల్స్మేనేజర్లు చెపుతున్నారు. పైగా ఆర్టీసీ, ఇతర పరిశ్రమలు సైతం బయట బంకుల్లోనే ఆయిల్ కొంటుండటంతో వాడకం పెరిగింది. పైగా ఇంతకుముందులా క్రెడిట్బేసిస్లో కంపెనీలు అప్పు ఇవ్వడం లేదని, ముందు పైసలు కడితేనే ఆయిల్ఇస్తున్నారని డీలర్లు మొత్తుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో 166 పెట్రోల్ బ్యాంకులు ఉండగా రోజుకు 6లక్షల లీటర్లు డీజిల్ సప్లై చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4లక్షల లీటర్లే సరఫరా అవుతుంది.
రూరల్ ఏరియాల్లోనూ బంక్లు ఖాళీ..
పట్టణాల్లోని బంక్లో పెట్రోల్, డీజిల్కు సమస్య రాకుండా కొంత జాగ్రత్త పడుతున్నా రూరల్ ఏరియాల్లో బంక్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయ పనులు మొదలుకావడంతో డీజిల్ వాడకం పెరిగింది. ఆఫీసర్లు ఇప్పటికే రెండు, మూడు సార్లు సేల్స్మేనేజర్లు, డీలర్లతో చర్చించారు. కానీ పరిస్థతి కంట్రోల్కాకపోవడంతో సమస్యను సివిల్ సప్లై కమిషనర్కు రిపోర్ట్ చేస్తున్నారు.
కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం
పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు ఆందోళన చెందొద్దు. కంపెనీల నుంచే సప్లై తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా కొరత ఏర్పడుతోంది. అత్యవసర సేవలకు అవసరమయ్యేలా స్టాక్ పెట్టుకోవాలని డీలర్లను ఆదేశించాం. రెండు, మూడురోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. జిల్లాలో వాడకం పెరిగి న దృష్ట్యా కొరత రాకుండా చూడాలని కమిషనర్కు రిపోర్ట్ పంపాం. - వెంకటేశ్వర్లు, డీఎస్ఓ