- బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్పై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేత
- రెమ్డిసివిర్ పై ఇక 5 శాతం.. అంబులెన్స్లపై 12 శాతమే
- మంత్రుల బృందం సిఫారసులకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం
- వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, వెలుగు: కరోనా, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు వాడే మందులు, ఎక్విప్ మెంట్లపై జీఎస్ టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొన్ని మందులకు జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. మరికొన్ని మందుల జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో మందులు, ఎక్విప్ మెంట్ల ధరలు కూడా తగ్గాయి. వ్యాక్సిన్లపై మాత్రం జీఎస్ టీ రేటును యథాతథంగా కొనసాగించింది. వ్యాక్సిన్ల బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకున్నందున.. వీటిపై జీఎస్టీ వల్ల ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ లు, మందులు, ఎక్విప్ మెంట్లపై జీఎస్ టీ రేట్ల విషయంపై శనివారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 44వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా మందులు, ఎక్విప్ మెంట్లపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం చేసిన సిఫారసులను అన్నింటినీ జీఎస్ టీ కౌన్సిల్ ఆమోదించినట్లు ఆమె ప్రకటించారు.
..కరోనా మందులు అగ్గువ
మందులు, ఆక్సిజన్, ఆక్సిజన్జనరేషన్ఎక్విప్మెంట్, టెస్టింగ్ కిట్లు, ఇతర మెషీన్లు, రిలీఫ్ మెటీరియల్ వంటి నాలుగు కేటగిరీలకు జీఎస్టీ రేట్లను ఈ మీటింగ్లో నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు వాడే టోసిలిజుమాబ్, యాంఫొటెరిసిన్బీ మెడిసిన్స్పై జీఎస్టీ 5 శాతం ఉండగా, ఇప్పుడు పూర్తిగా తీసేసినట్లు చెప్పారు. కరోనా ట్రీట్మెంట్కు వాడుతున్న రెమ్డిసివిర్ మందుపై జీఎస్టీని12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అంబులెన్స్పై జీఎస్టీ రేటును ఇప్పటిదాకా ఉన్న 28 శాతం నుంచి12 శాతానికి తగ్గించారు. వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీనే కొనసాగించాలని నిర్ణయించారు. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొంటుందని, జీఎస్టీ కూడా చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ లపై జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతాన్ని రాష్ట్రాలకు పంచుతుందని కూడా వివరించారు.
జీఎస్టీ తగ్గింపు హర్షణీయం: సంజయ్
వైద్య ఉపకరణాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో మందులు, ఇంజక్షన్లు, పరికరాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారన్నారు. కేంద్రం నిర్ణయంతో కరోనా బాధితులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.
సెప్టెంబర్ చివరిదాకా ఇవే ధరలు
ఎలక్ట్రిక్ ఫర్నేస్లు, టెంపరేచర్ చెకింగ్ పరికరాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించామని, సవరించిన రేట్లన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ చివరిదాకా కొనసాగుతాయని మంత్రి నిర్మల చెప్పారు. మంత్రుల గ్రూప్ ఆగస్టు దాకానే రికమండ్ చేసిందని, అయినా సెప్టెంబర్ దాకా కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. మెడికల్ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర ఆక్సిజన్ నిల్వ, రవాణా పరికరాలు, కొన్ని డయాగ్నస్టిక్ మార్కర్స్ టెస్టు కిట్లు వంటివి విదేశాల నుంచి ప్రభుత్వానికి, లేదా రిలీఫ్ ఏజెన్సీలకు వస్తే.. వాటిపై ఐజీఎస్టీ మినహాయింపు ఆగస్టు చివరిదాకా కొనసాగనుందని మంత్రి తెలిపారు.
పూర్తిగా జీఎస్టీ రద్దు చేసిన మందులు
- టొసిలిజుమాబ్పై ఉన్న 5% జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు.
- బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో వాడే ఆంఫోటెరిసిన్‑బీ పై ఉన్న 5% పన్ను తీసేశారు.
మందులపై 12 నుంచి 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
- హెపరిన్ (యాంటీ కొయాగులెంట్స్), రెమ్డిసివిర్,
- ఇతర కరోనా మందులు
పరికరాలపై 12 నుంచి 5 శాతానికి
- కరోనా టెస్టింట్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ , ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, జనరేటర్లు, వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్కులు, క్యానులా, హెల్మెట్లు, హైఫ్లో నాసల్ క్యానులా మెషీన్లు, డి-డైమర్, ఐఎల్-6, ఫెర్రిటిన్ అండ్ ఎల్డీహెచ్.
15 నుంచి 5 శాతానికి తగ్గినవి
- బీపప్ మెషీన్లు, టెంపరేచర్ కొలిచే పరికరాలు.
18 నుంచి 5 శాతానికి తగ్గినవి
- శానిటైజర్లు, అంత్యక్రియల్లో వాడే గ్యాస్, ఎలక్ట్రిక్ సహా ఇతర పరికరాలు
28 నుంచి 12 శాతానికి తగ్గినవి
- అంబులెన్సు సేవలు