హైదరాబాద్, వెలుగు: మైనింగ్ వల్ల ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయానికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను సింగరేణి యాజమాన్యం ఖండించింది. అవి కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని పేర్కొంది. సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపూర్లో చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉందని తెలిపింది.
ప్రాజెక్టుపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం పూర్తైన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాతే ముందుకు వెళ్తామని తెలిపింది. గతంలోనూ ఇలాంటి అపోహలతో కూడిన కథనాలు వచ్చాయని, అప్పుడే తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించామని గుర్తు చేసింది.
బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపదకు నష్టం చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయదని పేర్కొంది.
