ఒకప్పుడు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో రారాజుగా వెలిగిన ఫిన్నిష్ దిగ్గజం నోకియా, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న ఈ సంస్థ భారత విభాగంలోనూ లేఆఫ్స్కి సిద్ధమైంది. సంస్థను పునర్వ్యవస్థీకరించే ప్రణాళికలో భాగంగా ఏకంగా 14వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా సాగుతోంది.
ప్రస్తుతం నోకియాకు ప్రపంచవ్యాప్తంగా 74వేల మందికి పైగా ఉద్యోగులు ఉండగా, అందులో దాదాపు 17వేల మంది భారత్లోనే పనిచేస్తున్నారు. అయితే సంస్థ తన మొత్తం గ్లోబల్ వర్క్ఫోర్స్లో 20 శాతం మేర కోత విధించనుంది. భారత్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2025 నాలుగో త్రైమాసికంలో నోకియా ఇండియా నికర విక్రయాలు 15 శాతం క్షీణించి 393 మిలియన్ యూరోలకు అంటే సుమారు రూ.4వేల 290 కోట్లకు పడిపోయాయి.
లేఆఫ్స్ ప్రక్రియను అమలు చేయడంతో పాటు, ఇండియా నాయకత్వంలోనూ నోకియా కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1, 2026 నుండి సమర్ మిట్టల్ను ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా, విభా మెహ్రాను ఇండియా కంట్రీ మేనేజర్గా నియమించింది. ఇప్పటివరకు ఇండియా హెడ్గా ఉన్న తరుణ్ ఛబ్రా తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. కొత్తగా వచ్చిన సమర్ మిట్టల్కు మునుపటి కంటే ఎక్కువ పవర్స్ కల్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్లౌడ్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్, మొబైల్ నెట్వర్క్స్ విభాగాల విలీనం వల్ల ఏర్పడిన 'డూప్లికేషన్' సమస్యను పరిష్కరించడానికి ఈ లేఆఫ్స్ దోహదపడనున్నాయి.
నోకియా ఉద్యోగుల సంఖ్య ఏటికేడూ తగ్గుతూనే వస్తోంది. 2018లో ఈ సంస్థలో 1.03 లక్షల మంది పనిచేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 74,100కు పరిమితమైంది. కేవలం ఇండియాలోనే గత ఎనిమిదేళ్లలో 500 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. భారత్తో పాటు ఐరోపాలోని గ్రీస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లోనూ సుమారు 1,400 మందిని తొలగించే పనిలో నోకియా ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో నోకియా నిర్ణయం టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు నోకియా ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా ఇప్పటికే 5వేల మందిని తొలగించి, మరిన్ని లేఆఫ్స్కు సిద్ధమవుతుండటం టెలికాం రంగంలోని సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది.
