బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో వివాహం మరోసారి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవల ( జూలై 5, 2026) గౌరీ స్ప్రాట్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సివిల్ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. మరోవైపు రాజకీయ నేతలు ఈ వివాహాన్ని 'లవ్ జిహాద్' అని విమర్శించడంతో ఒక్కసారిగా రాజకీయ, సామాజిక దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లౌకిక, సమ్మేళన కుటుంబం..
తమది అత్యంత లౌకిక, సమ్మేళన కుటుంబ అని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. నన్ను 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అనడం హాస్యాస్పదంగా ఉంది. మా కుటుంబం ఎప్పుడూ అన్ని మతాలను గౌరవిస్తుంది. నా ఇద్దరు సోదరీమణులు హిందువులను వివాహం చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందువునే పెళ్లి చేసుకుంది. నా బంధువు మన్సూర్ క్రిస్టియన్ను వివాహం చేసుకున్నాడు. మా ఇంట్లో ఎప్పుడూ మతాల హద్దులు లేవు. మతాన్ని వివాహానికి అడ్డంకిగా చూడలేదు అని అమీర్ పేర్కొన్నారు.
మతం మారలేదు..
తన జీవితంలో జరిగిన మూడు వివాహాల్లోనూ మత మార్పిడి జరగలేదని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. నా మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కానీ.. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ కానీ... ఎవరూ పెళ్లి కోసం తమ మతాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే మా వివాహాలన్నీ సివిల్ మ్యారేజీలే. అసలు గౌరీ హిందువు కూడా కాదు.. ఆమె క్రిస్టియన్. అదీ కాకుండా మతాచారాలను కఠినంగా పాటించే వ్యక్తి కూడా కాదు. ఇలాంటి ఆరోపణలు వినడం ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తోంది అని అమీర్ కౌంటర్ ఇచ్చారు.
►ALSO READ | Jana Nayagan Release: విజయ్ 'జననాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ దేశంలో టికెట్ల కోసం కొత్త రూల్స్!
అమీర్ పెళ్లిపై ఫత్వా జారీ..
ఇదిలా ఉండగా.. అమీర్-గౌరీల పెళ్లికి సంబంధించిన ఓ బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో గౌరీ స్ప్రాట్.. 'అమీర్ ఖాన్ను నా రక్షకుడిగా, నా ఆశ్రయంగా భావిస్తూ నా భర్తగా స్వీకరిస్తున్నాను' అంటూ ప్రమాణ స్వీకారం చేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అయితే ఈ వివాహంపై షాహీ చీఫ్ ముఫ్తీ ఇబ్రహీం హుస్సేన్ ఫత్వా జారీ చేయడంతో పాటు, మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కూడా 'లవ్ జిహాద్' అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వివాదాల మధ్య ఆమిర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
