కొత్తగూడెం జిల్లా లోఇష్టారీతిన అభివృద్ధి పనులు

 కొత్తగూడెం జిల్లా లోఇష్టారీతిన అభివృద్ధి పనులు
  • కొత్తగూడెంలో రూ.కోట్ల పనులపై పర్యవేక్షణ కరువు
  • ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీ
  • క్వాలిటీ గాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్లంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉండడం కాంట్రాక్టర్లకు కలిసి వస్తోంది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇష్టారీతిన పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పాటించడం లేదు. పర్యవేక్షించాల్సి అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం టౌన్​లో రూ. 5కోట్లకు పైగా సీసీ రోడ్లు, డ్రైనేజీలతోపాటు మార్కెట్ పనులు సాగుతున్నాయి. స్థానిక ఎంజీ రోడ్​సమీపంలో దాదాపు రూ.కోటితో మార్కెట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

కాంట్రాక్టర్​ఇష్టారీతిన పనులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గోదావరి ఇసుక వాడాల్సి ఉండగా, మొదట్లో సమీపంలోని వాగుల్లోని ఇసుక వాడారు. పలువురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత మేర గోదావరి ఇసుకను ఉపయోగించారు. నిబంధనలకు విరుద్దంగా సమీపంలోని ఓవర్​హెడ్ ట్యాంక్​ నుంచి డైరెక్ట్​గా నల్లా కనెక్షన్​ తీసుకొని వినియోగిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇసుక, సిమెంట్, వాటర్​మిక్సింగ్​లోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలైన్, మార్కెట్​ ఏరియా, బూడిదగడ్డ, పెద్దబజార్, ఓల్డ్​ డిపో నుంచి పాత కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటించడం లేదు. వైబ్రేటర్​ను కేవలం ఆఫీసర్లు వచ్చినప్పుడే వాడుతూ మిగిలిన టైంలో కర్రలనే వైబ్రేటర్లుగా వినియోగిస్తున్నారు. గత నెలలో వానల టైంలోనూ కాంట్రాక్టర్లు సీసీ నిర్మాణాలు చేపట్టారు. ఎంజీ రోడ్డు నుంచి లేపాక్షి హోటల్​వైపు డ్రైనేజీ నిర్మాణం అడ్డదిడ్డంగా చేపట్టారు.

షాపుల ముందు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేయడం అధికారుల పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీకి మెట్లు అడ్డం వస్తున్నాయని చెప్పా పెట్టాకుండా కూల్చివేసిన ఆఫీసర్లు, కొన్ని షాపుల ముందు తిరిగి డ్రైనేజీలు నిర్మించలేదని వాపోతున్నారు. సూర్యా ప్యాలెస్​నుంచి ఎస్పీ ఆఫీస్​, ఓల్డ్​డిపో నుంచి పాత కొత్తగూడెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన డ్రైనేజీల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు అభివృద్ధి పనుల్లో క్వాలిటీకి పెద్ద పీట వేస్తున్నామని మున్సిపల్​కమిషనర్​రఘు, డీఈ రవికుమార్ పేర్కొంటున్నారు. మార్కెట్​నిర్మాణానికి ఓవర్​హెడ్​ట్యాంక్​ నుంచి నల్లా నీటిని వాడొద్దని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు గోదావరి ఇసుకనే వాడాల్సి ఉందన్నారు.