
స్టావాంగర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్లో ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ మరోసారి మెరిశాడు. టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి సంచలనం సృష్టించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఎనిమిదో రౌండ్లో అర్జున్ క్లాసికల్ గేమ్లో కరువానాకు చెక్ పెట్టాడు. అయితే, వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ జోరుకు బ్రేక్ పడింది. అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా .. గుకేశ్ను ఓడించాడు. మూడో రౌండ్లో ఇండియా జీఎం చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇదే రౌండ్లో నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్సన్పై చైనా ప్లేయర్ వీ యి ఆర్మగెడాన్ టై బ్రేక్లో గెలుపొందాడు. ఇంకో రెండు రౌండ్లు మిగిలున్న ఈవెంట్లో కరువానా 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కార్ల్సన్ (12) రెండో ప్లేస్లో ఉండగా, గుకేశ్, నకమురా చెరో 11.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఐదో స్థానంలో ఉన్న అర్జున్ ఖాతాలో 10.5 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు విమెన్స్ సెక్షన్లో ఇండియా లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపి.. సారా ఖాదెమ్ (స్పెయిన్)ను ఓడించి 13.5 పాయింట్లతో టాప్ ప్లేస్కు చేరుకుంది. ఆర్. వైశాలి.. వరల్డ్ చాంపియన్ జు వెంజున్ (చైనా)ను ఆర్మగెడాన్ టై-బ్రేక్లో ఓడించింది.