ధర్మసాగర్, వెలుగు : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో వసతులు, ఉపాధ్యాయులు లేని కారణంగా ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లిలో 14 ఏండ్ల కింద మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పున:ప్రారంభించి, ప్రీ ప్రైమరీ స్కూల్ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సింగరావుపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలను మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొన్నారు.
