
న్యూఢిల్లీ: తమ ప్లాన్ను పక్కాగా అమలు చేసే పదునైన బౌలింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ టీమ్ను ఆ దేశంలో ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. అయితే, వచ్చే నెలలో కివీస్తో టెస్టు సిరీస్లో ఎదురయ్యే సవాళ్లకు తాను రెడీగా ఉన్నానని చెప్పాడు. ‘న్యూజిలాండ్లో క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. గత టూర్లో మేం టెస్టు సిరీస్ (0–1తో) కోల్పోయినా బాగా పోరాడాం. అయితే, అప్పటితో పోల్చితే ప్రస్తుత మా బౌలింగ్ అటాక్ పూర్తిగా డిఫరెంట్. పర్సనల్గా ఈ టూర్ నాకు కూడా సవాల్గా మారనుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. న్యూ బాల్ బౌలర్లతో పాటు మిడిల్ ఓవర్లలో కూడా కివీస్ ఆటగాళ్లను ఫేస్ చేయడం సులభమైన విషయం కాదు. కొత్త బంతిని ఎదుర్కోవడం ఏ కండిషన్లలో అయినా.. ముఖ్యంగా ఇండియా అవతల చాలా కష్టమైన పని. అయితే, 2014లో కూడా (కివీస్లో) ఆడాను కాబట్టి అక్కడ ఏం ఆశించాలో నాకు తెలుసు. కివీస్లో ఎదురయ్యే సవాల్కు నేను రెడీగా ఉన్నా’అని రోహిత్ తెలిపాడు. ఇక, ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ 0–3తో వైట్వాష్కు గురైనప్పటికీ ఆ జట్టును తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు.
ముంబై రంజీ టీమ్కు రోహిత్ మార్గనిర్దేశం
రంజీ ట్రోఫీలో చెత్తగా ఆడుతున్న ముంబై జట్టుతో రోహిత్ సమావేశయ్యాడు. మెగా టోర్నీలో గత రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిన ముంబై డీలా పడింది. దాంతో, ఆ జట్టు ఆటగాళ్లలో రోహిత్ ఉత్తేజం నింపే ప్రయత్నం చేశాడు. మంగళవారం ముంబై బీకేసీ ఫెసిలిటీలో ఆటగాళ్లను కలిసిన హిట్మ్యాన్.. ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో వారికి మార్గనిర్దేశం చేసినట్టు ఆ జట్టు వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ముంబై కోచ్ వినయక్ సమంత్, బౌలింగ్ కోచ్ ప్రదీప్ సుందరం, టీమ్ మేనేజర్ అజింక్యా నాయక్ కూడా పాల్గొన్నారు.