బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీసులకు నోటీసులు

బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీసులకు నోటీసులు
  •      మొన్న నల్గొండ.. ఇప్పుడు హనుమకొండ  
  •     పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదుతో కదిలిన ఆఫీసర్లు
  •     భూ కేటాయింపు, బిల్డింగ్‍ పర్మిషన్‍ పత్రాలివ్వాలని మున్సిపల్​ తాఖీదులు

వరంగల్‍, వెలుగు : అక్రమంగా కట్టిన బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీసులకు మున్సిపల్​అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మొన్న నల్గొండ జిల్లాలో బీఆర్‍ఎస్‍ లీడర్లు ఆఫీసుల పేరుతో వందల కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశారని తేలగా, అక్కడి ఆఫీసర్లు నోటీసులిచ్చారు. దీన్ని గులాబీ లీడర్లు పట్టించుకోకపోవడంతో సీరియస్‍ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‍రెడ్డి పర్మిషన్‍ లేకుండా కట్టిన బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ను కూల్చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఇదే తరహా ఘటన హనుమకొండ జిల్లా బీఆర్‍ఎస్‍ పార్టీ స్థలం విషయంలోనూ జరిగింది. ఇదే తరహా నోటీసులను మున్సిపల్‍ అధికారులు బీఆర్‍ఎస్‍ పార్టీ జిల్లా అధ్యక్షుడికి అందజేశారు.  

వీ 6 వెలుగులో కథనాలు  

హనుమకొండ జిల్లా బీఆర్‍ఎస్‍ పార్టీకి నగర నడిబొడ్డున ఉండే బాలసముద్రంలోని కమర్షియల్‍ ఏరియాలో గులాబీ లీడర్లు ఎకరం స్థలంలో దాదాపు రెండేండ్ల క్రితం ఆఫీస్‍ నిర్మించారు. మున్సిపల్‍ మంత్రి, పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. గవర్నమెంట్‍ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా బీఆర్‍ఎస్‍ పార్టీ అక్రమ నిర్మాణం చేపట్టిందని అప్పట్లోనే వీ6 వెలుగు దినపత్రికలో కథనాలు వచ్చాయి. 

కాంగ్రెస్‍ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో సహా విపక్ష పార్టీలు ఆనాడే భూకబ్జాపై మండిపడ్డాయి. విచారణ చేయించాలని అధికారులను కోరినా ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఆఫీసర్లు స్పందించలేదు. 

ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదుతో నోటీసులు 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. పార్కు స్థలం కబ్జా చేసి హనుమకొండ బీఆర్ఎస్​పార్టీ ఆఫీసును కట్టారంటూ మూడు నెలల క్రితం ప్రస్తుత వరంగల్​పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి ఆర్డీవోతో పాటు కలెక్టర్‍కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయిస్తూ ఇచ్చిన పర్మిషన్‍ పేపర్లు ఇవ్వాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. 

దీంతో కలెక్టర్‍ ఆదేశానుసారం గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ అధికారులు కదిలారు. తెలంగాణ మున్సిపల్ ​యాక్ట్​2019లోని సెక్షన్‍ 254 ప్రకారం బీఆర్‍ఎస్‍ పార్టీకి కాజీపేట సర్కిల్‍–2 నుంచి నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని 1066 సర్వే నంబర్‍లో బీఆర్‍ఎస్‍ పార్టీకి స్థలం కేటాయిస్తూ అధికారులు ఇచ్చిన పర్మిషన్‍ పత్రాలు, భవన నిర్మాణ అనుమతి కాపీలు చూపించాలని హనుమకొండ బీఆర్ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్​భాస్కర్​కు గత నెల 25న నోటీసులు ఇచ్చారు. వెరిఫికేషన్‍ కోసం నోటీసులు అందిన మూడు రోజుల్లోగా పర్మిషన్‍ కాపీలన్ని సమర్పించాలని కోరారు. బీఆర్‍ఎస్‍ నేతల స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నారు.