కోపల్లె ఫార్మా కంపెనీకి నోటీసులు

కోపల్లె ఫార్మా కంపెనీకి నోటీసులు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్​ డ్రమ్ములు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన కోపల్లె ఫార్మా కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కంపెనీ ఆవరణలో స్టోర్ ​చేసిన అత్యంత ప్రమాదకరమైన కెమికల్ డ్రమ్ములు పేలి గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దాదాపు 500 కుటుంబాలు నరకయాతన అనుభవించాయి.

పొగ, కెమికల్ వాసనతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో తెలిసినవారు, బంధువుల ఇండ్లలో పడుకున్నారు. మేడ్చల్ జిల్లా పీసీబీ రీజనల్ ఆఫీసర్ రాజేందర్ శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లుతోందని పలుసార్లు కోపల్లె కంపెనీని మూసివేశామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రన్నింగ్​లో లేదని, ప్రమాదకర కెమికల్స్ ను ట్యాంకులు, డ్రమ్ముల్లో స్టోర్​ చేసినట్లు గుర్తించామన్నారు. కెమికల్ ​వేస్టేజ్​ను వెంటనే దుండిగల్ టీఎస్​డీఎఫ్​కు తరలించాలని ఆదేశించినట్లు తెలిపారు. కోపల్లె ఫార్మా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మోడీ అపార్ట్​మెంట్​వాసులు జీడిమెట్ల సీఐ పవన్ కు  ఫిర్యాదు చేశారు.