ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..జనవరి 29న పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..జనవరి 29న పోలింగ్
  • = రెండు పదవులకు వేర్వేరుగా విడుదల
  • = ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
  • = రెండు పదవులూ కాంగ్రెస్ కే వచ్చే చాన్స్
  • = 29న పోలింగ్.. అదే రోజున కౌంటింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలింగ్  సైతం అదే పద్ధతిలో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఈ రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనుండటంతో ఈ రెండు పదవులు కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది.

మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి 1  ఎమ్మెల్యే ఉన్నారు. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెజార్టీ సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ వశమవుతాయి.  ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉంటుంది.

అసెంబ్లీ కార్యాలయం ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19న పరిశీలన, 22వ తేదీలోపు ఉపసంహరణలకు గడువు విధించింది. 29వ తేదీన పోలింగ్  నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేసి విజేతను ప్రకటిస్తారు.