న్యూయార్క్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో13వ సారి యూఎస్ ఓపెన్ సెమీస్లోకి ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. ఓవరాల్గా జొకోకు ఇది 47వ స్లామ్ సెమీస్. దాంతో ఓపెన్ ఎరాలో గ్రాండ్స్లామ్స్లో అత్యధిక సార్లు సెమీస్ చేరిన ఫెడరర్ (46) రికార్డును జొకో అధిగమించాడు. జొకో ఇప్పటివరకు వింబుల్డన్లో13, ఫ్రెంచ్ ఓపెన్లో12సార్లు సెమీస్కు చేరాడు. అలాగే ఏటీపీ చరిత్రలో ఎక్కువసార్లు యూఎస్ ఓపెన్ సెమీస్ (13) చేరిన తొలి ప్లేయర్గానూ రికార్డులకెక్కాడు. మరోవైపు ఈ ఏడాది నాలుగు గ్రాండ్స్లామ్స్ ఫైనల్స్ చేరిన ప్లేయర్గా ఘనత సాధించేందుకు జొకో ఒక అడుగు దూరంలో నిలిచాడు. 2015, 2021లో జొకో ఈ రికార్డు అందుకున్నాడు. ఫ్రిట్జ్తో 2 గంటలా 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సెర్బియా ప్లేయర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. బలమైన సర్వీస్లు, పదునైన ఫోర్హ్యాండ్, బ్యాక్హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో మ్యాచ్లో అన్సీడెడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా)ను ఓడించాడు. విమెన్స్ క్వార్టర్ఫైనల్లో ఆరోసీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–0, 6–2తో జెలెనా ఒస్తాపెంకో (లాత్వియా)పై గెలిచి తొలిసారి సెమీస్లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్లో ముచోవా (చెక్) 6–0, 6–3తో సోరెనా క్రిస్టియా (రొమేనియా)పై నెగ్గింది.
సెమీస్లో బోపన్న జోడీ
ఇండియా డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీస్లోకి ప్రవేశించింది. మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ 7–6 (12/10), 6–1తో నేథనిల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా)పై గెలిచింది. మ్యాచ్ మొత్తంలో రెండు బ్రేక్ పాయింట్లు రాబట్టియన బోపన్న ద్వయం 10 ఏస్లు, 37 విన్నర్స్ సాధించింది.