- గ్రీన్జోన్లో వాడేందుకు పర్మిషన్ అక్కర్లే
- రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజు రూ. వందే
డ్రోన్లను వాడాలంటే ఇకపై ఈజీగా పర్మిషన్ పొందొచ్చు. వేలకు వేలు ఫీజు కట్టాల్సిన పని లేకుండానే గ్రీన్జోన్లో డ్రోన్లు ఎగరేయవచ్చు. అందుకుతగ్గట్టు కొత్తగా డ్రోన్ రూల్స్ 2021ని కేంద్రం విడుదల చేసింది. అంతకు ముందున్న అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఏఎస్) రూల్స్ 2021లో మార్పులు చేసి తాజా రూల్స్ను చేర్చింది. మారిన రూల్స్తో మరికొన్నేండ్లలోనే ‘ఎయిర్ ట్యాక్సీ’లకు రూట్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: డ్రోన్లను వాడాలంటే ఇకపై ఎన్నెన్నో అప్లికేషన్లను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వేలకు వేలు ఫీజు కట్టాల్సిన పని లేదు. గ్రీన్జోన్లో డ్రోన్ లు ఎగరేయాలంటే అనుమతులూ అక్కర్లేదు. అవును, అందుకుతగ్గట్టు కొత్తగా డ్రోన్ రూల్స్ 2021ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంతకుముందున్న అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఏఎస్) రూల్స్ 2021లో మార్పులు చేసి తాజా రూల్స్ను చేర్చింది. మారిన రూల్స్తో మరికొన్నేండ్లలోనే ‘ఎయిర్ ట్యాక్సీ’లకు రూట్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త రూల్స్ వివరాలను సివిల్ ఏవియేషన్ శాఖ గురువారం వెల్లడించింది.
5 ఫామ్లు.. 4 ఫీజులే..
ఇప్పటిదాకా డ్రోన్లకు పర్మిషన్ పొందాలంటే వేర్వేరుగా 25 అప్లికేషన్ లు పెట్టుకోవాల్సి ఉండేది. 72 రకాల ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు అప్లికేషన్లను ఐదుకు, ఫీజులను నాలుగుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అన్ని రకాల డ్రోన్లకు రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.100కు తగ్గించింది. ఆ లైసెన్స్ పదేండ్ల పాటు చెలామణీలో ఉంటుంది. డ్రోన్ల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లోనే చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. చిన్న, అతిచిన్న డ్రోన్లను వాడేందుకు రిమోట్ పైలట్ లైసెన్స్ల నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది. రిజిస్ట్రేషన్, లైసెన్స్లకు సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్లను తీసుకోవాల్సిన అవసరం లేదు.
‘డిజిటల్ స్కై’లో మ్యాప్లు
డ్రోన్ల వాడకానికి సంబంధించి ఎయిర్స్పేస్ మ్యాప్లను డిజిటల్ స్కై వెబ్సైట్లో నెలలోపు కేంద్రం పెట్టనుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు జోన్లతో కూడిన ఎయిర్ స్పేస్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. కొత్త రూల్స్ ప్రకారం గ్రీన్ జోన్లో డ్రోన్లను వాడేందుకు అనుమతి అవసరం లేదు. దీని ప్రకారం గ్రీన్జోన్లోని 8 నుంచి 12 కిలోమీటర్ల పరిధిలోని 200 అడుగుల ఎత్తులో డ్రోన్లను ఎగురవేయవచ్చు. పసుపు జోన్ పరిధిని 45 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లకు కేంద్రం కుదించింది. ఒకవేళ రూల్స్ను మీరితే జరిమానాను రూ.లక్షగా నిర్ణయించింది. అయితే, ఇతర చట్టాల రూల్స్ బ్రేక్ చేస్తే వేసే ఫైన్ల నుంచి మినహాయింపునివ్వలేదు.