
- యునిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 11.8 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఈ ఏడాది జులైలో 23 కోట్ల ఇన్వెస్టర్ ట్రేడింగ్ అకౌంట్ల మైలురాయిని దాటింది. గత మూడు నెలల్లో ఒక కోటి అకౌంట్లు యాడ్ అయ్యాయని సంస్థ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో 22 కోట్ల మార్కును అధిగమించింది. ఇన్వెస్టర్ ట్రేడింగ్ అకౌంట్లలో ఒకే పాన్కార్డుపై వేరు వేరు బ్రోకర్ల దగ్గర ఓపెన్ చేసిన అకౌంట్లు కూడా ఉంటాయి.
కాగా, యునిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు (ఒక పాన్కార్డుపై ఒక అకౌంట్) 11.8 కోట్లకు చేరారు. ఎన్ఎస్ఈలో మహారాష్ట్ర నుంచి 4 కోట్ల ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మొత్తం అకౌంట్లలో దీని వాటా 17 శాతంగా ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి 2.5 కోట్ల అకౌంట్లు, గుజరాత్ నుంచి 2 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ నుంచి 1.3 కోట్ల చొప్పున అకౌంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలు సగం అకౌంట్లను కలిగి ఉన్నాయి. యువ, కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. డిజిటలైజేషన్, ఫైనాన్షియల్ లిటరసీ పెరగడమే ఇందుకు కారణమని తెలిపారు.